ఎమ్మెల్సీగ ప్రమాణం చేసిన బండా ప్రకాశ్‌


అభినందించి సన్మానించిన మంత్రి ఎర్రబెల్లి
హైదరాబాద్‌,డిసెంబర్‌8 జనం సాక్షి : ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీగా ఎన్నికైన డాక్టర్‌ బండా ప్రకాశ్‌ బుధవారం పదవీ ప్రమాణం చేశారు. ప్రొటెం చైర్మన్‌ భూపాల్‌ రెడ్డి ఛాంబర్‌లో జరిగిన కార్యక్రమానికి పలువురు మంత్రులు, ప్రజా ప్రతినిధులు, బండ ప్రకాష్‌ కుటుంబ సభ్యులు హాజరయ్యారు. ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేసిన బండా ప్రకాశ్‌కు పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు శుభాకాంక్షలు తెలిపారు. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి మంత్రులు సత్యవతి రాథోడ్‌, మంత్రి మహమూద్‌ అలీ, టీఆర్‌ఎస్‌ పార్లమెంటరీ పార్టీ నేత కె కేశవ రావు, మాజీ ఉప ముఖ్యమంత్రులు ఎమ్మెల్సీ కడియం శ్రీహరి, ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య, ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణ రెడ్డి, ప్రభాకర రావు, బొడకుంటి వెంకటేశ్వర్లు, శ్రీనివాస్‌ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే సుధాకర్‌ రావు తదితరులు హాజరయ్యారు. అనంతరం ఆయనను శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ.. సమర్థుడైన బండా ప్రకాశ్‌కి సీఎం కేసీఆర్‌ మంచి అవకాశం కల్పించారన్నారు. తన పదవికి వన్నె తెచ్చే విధంగా పని చేయాలని, అటు ప్రభుత్వానికి, ఇటు శాసన మండలికి, మంచి పేరు తెచ్చే విధంగా పని చేయాలని ఆకాంక్షించారు.