ఎసిబి వలలో ప్రభుత్వాధికారి
లంచం డిమాండ్ చేసిన జలవనరుల శాఖ అధికారి
నెల్లూరు,నవంబర్12(జనంసాక్షి): నెల్లూరు జిల్లాలో ఏసిబి అవినీతి అధికారుల భరతం పడుతున్నది.. రెండు రోజుల క్రితం ఆదాయానికి మించి ఆస్తులు కలిగిఉన్నారన్న సమాచారంతో సాంఘీక సంక్షేమశాఖ డిప్యూటీ డైరెక్టర్ మధుసూదనరావుపై కొరఢా జుళింపించిన అవినీతి నిరోధక శాఖ అధికారులు, తాజాగా మరో లంచావతార అధికారిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. నెల్లూరు రామలింగాపురం సర్కిల్ వద్ద ఉన్న జలవనరుల శాఖలో దేవాంగుల వెంకట్రావ్ అసిస్టెంట్ ఇంజనీర్ గా పనిచేస్తున్నారు. నీరు చెట్టు పథకం కింద చేపట్టిన కొన్ని కాంట్రాక్టు పనుల బిల్లుల విడుదల చేయించుకునే క్రమంలో మర్రిపాడు మాజీ సర్పంచ్ పెంచలయ్య క్వాలిటీ కంట్రోల్ సర్టిఫికేట్ కోసం వెంకట్రావ్ వద్దకు వెళ్లాడు. అయితే వెంకట్రావ్ సర్టిఫికేట్ ఇవ్వకుండా మూడు నెలల నుండి పెంచలయ్యను కార్యాలయం చుట్టూ తిప్పుకుంటుండేవాడు. చివరకు బిల్లు మొత్తం 65 లక్షల 9వేలలో, 56వేల రూపాయలను లంచంగా డిమాండ్ చేశాడు. దీంతో మాజీ సర్పంచ్ పెంచలయ్య ఏసిబి అధికారులను ఆశ్రయించారు. ఇందులో భాగంగా సోమవారం ఉదయం రామలింగాపురంలోని తన కార్యాలయంలో పెంచలయ్య వద్ద లంచం నగదు 56వేలు తీసుకుంటూ ఏసిబి
అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా వెంకట్రావ్ పట్టుబడ్డారు. కేసు నమోదు చేసిన అధికారులు, పెంచలయ్యను అదుపులోకి తీసుకుని, రిమాండ్ కు పంపనున్నారు.