ఎస్సీ కార్పోరేషన్‌ ద్వారా భూ అభివృద్ది

అనంతపురం,మార్చి18(జ‌నంసాక్షి): షెడ్యూల్‌ కులాలకు చెందిన రైతుల భూములను  ప్రభుత్వం ఎస్సీ కార్పోరేషన్‌ ద్వారా భూమి అభివృద్ధి పథకాన్ని అమలు చేయాలని నిర్ణయించింది.  ఒక్కో రైతుకు హెక్టారు
వరకు భూమిని అభివృద్ధి చేసుకునేందుకు ప్రభుత్వం రూ.25 వేలు విడుదల చేయనుంది. జిల్లాలో భూ అభివృద్ధి పథకం కింద 133 యూనిట్లను కేటాయించారు. ఈ పథకం జిల్లా నీటి యాజమాన్య సంస్థ అభివృద్ధి చేసిన భూములకు వర్తించదు. ఎస్సీ కార్పోరేషన్‌ ద్వారా కొనుగోలు చేసిన రైతులకు, అసైన్డ్‌భూములకు, భూ పంపిణీలో కేటాయించిన భూములకు పథకం వర్తిసుంది. ఆసక్తిగల రైతులు మండల అభివృద్ధి అధికారిని సంప్రదించాలని ఎస్సీ కార్పోరేషన్‌ ఈడీ రామూనాయక్‌ తెలిపారు. ఇదిలావుంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, కాపు కార్పొరేషన్ల ద్వారా బడుగు, బలహీన వర్గాల లబ్ధిదారులకు రుణాల మంజూరులో ఎలాంటి జాప్యం చేయవద్దని కలెక్టర్‌ ఆదేశించారు. రుణాల మంజూరులో ఆలస్యం చేస్తే నిధులు వెనక్కి వెళ్లే పరిస్థితి ఉంటుంది. తద్వారా లబ్ధిదారులు నష్టపోవాల్సి వస్తోందన్నారు. రుణాలు మంజూరులో ఆలస్యం కావడంతో కలెక్టరేట్‌లో కంట్రోల్‌రూంను ఏర్పాటు చేశాం. అందరు సమన్వయంతో రుణ లక్ష్యాన్ని సత్వరమే పూర్తి చేయాలన్నారు. ప్రభుత్వం అందించే రాయితీ రుణాలను లబ్ధిదారులకు అందించేలా కృషి చేయాలన్నారు.