ఎస్సీ వర్గీకరణకు ఆమోదించాలి

మహబూబ్‌నగర్‌,నవంబరు 26(జనం సాక్షి): కేంద్రంలో తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే పార్లమెంట్‌లో ఎస్సీ వర్గీకరణ బిల్లును ప్రవేశపెట్టి చట్టబద్ధత కల్పిస్తామని చెప్పి బీజేపీ నేతలు అధికారంలోకి వచ్చాక కాలయాపన చేయడం ఎంతవరకు సమంజసమని ఎంఈఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు ఆకెపోగు రాములు అన్నారు. ఈ శీతాకాల పార్లమెంట్‌ సమావేశాలలో ఎస్సీలను ఏబీసీడీలుగా విభజించేందుకు కేంద్ర ప్రభుత్వం బిల్లును ప్రవేశపెట్టి ఆమోదించాలని డిమాండ్‌ చేశారు. ఎస్సీ వర్గీకరణ విషయంలో బీజేపీ ప్రభుత్వం మాదిగలను మోసం చేసిందని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లి పార్లమెంట్‌లో బిల్లు ప్రవేశపెట్టేలా తనవంతు ప్రయత్నం చేస్తానని చెప్పి ఇప్పుడు ఆ ఊసే ఎత్తడం లేదని అన్నారు. ఇందుకు మాదిగ యువకులు, మేధావులు, ఉద్యోగులు డిసెంబర్‌లో నిర్వహించతలపెట్టిన ఛలో ఢిల్లీ కార్యక్రమానికి పెద్దఎత్తున తరలివచ్చి ఎస్సీ వర్గీకరణ అవశ్యకతను కేంద్రానికి తెలియజేయాల్సిన అవసరం ఉందని అన్నారు.