ఐదో విడుత హారితహారానికి వర్షం దెబ్బ

వానలు రాక మరింత ఆలస్యం కానున్న కార్యక్రమం
ఖమ్మం,జులై4(జ‌నంసాక్షి): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న హరితహారం కార్యక్రమం అమలుకు జిల్లా యంత్రాంగం సన్నద్దమైంది. ఈ ఏడాది చెప్పట్టబోయే తెలంగాణ హరితహారం కార్యక్రమం విజయవంతం అయ్యేలా కలెక్టర్‌ ఆర్‌వీ కర్ణన్‌ పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నారు. వర్షా కురిసిన వెంటనే మొక్కలు నాటేందుకు నర్సరీలలో సిద్ధంగా ఉంచారు. తెలంగాణకు హరితహారం కార్యక్రమంలో జిల్లా అవసరాలను దృష్టిలో ఉంచుకుని 3.31 కోట్ల మొక్కలను సిద్ధంగా ఉంచామని ఖమ్మం ఫారెస్టు కన్జర్వేటర్‌ ప్రవీణ తెలిపారు.  జిల్లా కలెక్టర్‌ ఆర్‌వీ కర్ణన్‌, అటవీ శాఖ ఉన్నతాధికారుల సూచనల మేరకు వివిధ రకాల మొక్కలను హరితహారం కార్యక్రమంలో నాటేందుకు ప్రణాళికను రూపొందించామని అన్నారు. . వర్షం కురిసిన వెంటనే మొక్కలను నాటుతాం. ఇప్పటికే ఎక్కడెక్కడ మొక్కలు నాటాలో, ఏ స్థలంలో ఏ రకం మొక్క నాటాలో గుర్తించామని తెలిపారు. గతంలో జరిగిన లోపాలను సవిూక్షించుకుని ఈ ఏడాది విజయవంతంగా హరితహారం జరిగేలా అన్ని శాఖల అధికారులతో కలిసి కృషి చేస్తాం. రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా జిల్లాలో హరితహారం విజయవంతంగా నిర్వహిస్తామన్నారు.
గత హరితహారం కార్యక్రమంలో అనేక లోపాలు జరిగినట్లుగా అధికారులు గుర్తించారు. అటవీ శాఖ అధికారుల లోపాలతో పాటు వివిధ ప్రభుత్వ శాఖల క్షేత్రస్థాయి అధికారుల లోపాలు బాహాటంగా
కన్పించాయి. ఈ ఏడాది జిల్లాలోని ఐదు అసెంబ్లీ నియోజకవర్గాల్లో 3.31 కోట్ల మొక్కలు నాటాలని నిర్ణయించింది. నియోజకవర్గానికి 40 లక్షల మొక్కలు పెంచేలా ప్రణాళికను సిద్ధం చేశారు. ప్రతి రోజు ప్రజలకు అవసరం వచ్చే మొక్కలతో పాటు పండ్లు , టేకు, ఉసిరి తదితర మొక్కలు పెంచేందుకు సన్నద్ధమైంది. ఇప్పకే వివిధ ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో ఈ నర్సరీలను పెంచారు. ప్రతి గ్రామ పంచాయతీలో నర్సరీని ఏర్పాటు చేసి మొక్కలను పెంచారు. రహదారులు, చెరువులు, ప్రభుత్వ భూముల్లో మొక్కలను నాటడంతో పాటు ప్రతి ఇంటికి ఐదు మొక్కలను ఇవ్వనున్నారు. ఇందులో పండ్ల మొక్కలు, కరివేపాకు, బొప్పాయి, తదితర మొక్కలు ఇస్తారు. మొక్కలు నాటడంతోనే సరిపోదని, నాటిన ప్రతి మొక్క సజీవంగా ఉండి మొక్క దశ నుండి చెట్టుగా ఎదిగే వరకు సంరక్షణ బాధ్యతలు తీసుకోవాలని ఇటీవల వివిధ శాఖల అధికారులతో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్‌ ఆర్‌వీ కర్ణన్‌ అన్నారు. హరితహారంలో భాగంగా గృహ అవసరాలకు కావాల్సిన మొక్కలు కూడా పంపిణీ చేయనున్నారు. నాటిన ప్రతి మొక్కను జియోట్యాగింగ్‌ చేయనున్నారు. హరితహారం కార్యక్రమం విజయవంతం చేయడంలో ఎంపీడీఓల పాత్ర కీలకమైందన్నారు.  ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, సర్పంచ్‌లతో పాటు గ్రామ స్థాయిలో ప్రజా ప్రతినిధులను భాగస్వాములు చేసి హరితహారంలో వారి బాధ్యతను కూడా తెలియపర్చనున్నారు. వర్షాభావ పరిస్థితులు ఏర్పడడంతో ఈసారి హరితహారం కార్యక్రమాన్ని కొంత ఆలస్యంతో ఈ నెలాఖరులోగాని, ఆగస్టు మొదటి వారంలో గాని ప్రారంభమయ్యే అవకాశాలు కన్పిస్తున్నాయి. నూతన పంచాయతీ రాజ్‌ చట్టం ప్రకారం..ప్రతి గ్రామ పంచాయతిలో ఒక నర్సరీని ఏర్పాటు చేశారు. జిల్లా గ్రావిూణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ప్రతి గ్రామంలో నర్సరీలను ఏర్పాటు చేసి మొక్కలను పెంచారు.