ఒకేరోజు పెద్ద ఎత్తున ప్రసవాలు
వైద్య సిబ్బందిని అభినందించిన మంత్రి
హైదరాబాద్,జూలై12(జనం సాక్షి ): ఒకేరోజు పెద్ద ఎత్తున ప్రసవాలు జరగడం ఒక ఎత్తయితే..అందుకు కృషి చేసిన సిబ్బంది సేవలు మరింత అమోఘం. ఈ ఘటన సిద్దిపేట ఆస్పత్రిలో జరిగింది. దీంతో సిద్దిపేట ప్రభుత్వ జనరల్ హాస్పిటల్కి అనుబంధంగా పని చేస్తున్న మెడికల్ కాలేజీ ఎంసిహెచ్ విభాగం వైద్యులు, సిబ్బందికి రాష్ట్ర వైద్యారోగ్య కుటుంబ సంక్షేమశాఖ మంత్రి డాక్టర్ సి. లక్ష్మారెడ్డి అభినందనలు తెలిపారు. ఆస్పత్రిలో వైద్యులు ఒకే రోజు 33 మందికి ప్రసవాలు చేసిన విషయం తెలిసిందే. కేసీఆర్ కిట్ల పథకం ప్రారంభించాక రాష్ట్రంలో జరుగుతున్న ప్రసవాల మొత్తంలో సగానికిపైగా సర్కార్ దవాఖానాల్లోనే జరుగుతున్నాయన్నారు. సిద్దిపేట ఆస్పత్రి వైద్యులు, సిబ్బంది రాష్ట్ర వైద్యశాఖకే ఆదర్శంగా నిలిచారన్నారు. వీరిని ఆదర్శంగా తీసుకోవాలని రాష్ట్రంలోని వైద్యులు, మిగతా సిబ్బందికి మంత్రి సూచించారు. ఆర్మూరు ప్రభుత్వ దవాఖానాలో తన బిడ్డను ప్రసవింప చేయడం ద్వారా భద్రాద్రి కొత్తగూడెం వైద్యాధికారి దయానంద్ సర్కారీ దవాఖానాల విూద ప్రజలకు మరింత నమ్మకం పెంచారని మంత్రి లక్ష్మారెడ్డి అభినందించారు. తన కోడలు నవీన స్వస్థలం నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ కావడంతో, అక్కడే ప్రభుత్వ దవాఖానాలో చేర్పించి ప్రసవింప చేయడం అభినందనీయమన్నారు. తన కొడుక్కి రియంబర్స్ మెంట్ అవకాశం ఉన్నప్పటికీ, వినియోగించుకోకుండా, సర్కార్ దవాఖానాల విూద నమ్మకాన్ని పెంచుతూ తీసుకున్న నిర్ణయం అభినందనీయమన్నారు. సర్కార్ దవాఖానాల్లో అనేక అత్యాధునిక సదుపాయాలు కల్పించామని, పరికరాలు అందుబాటులో ఉన్నాయని, ఎంఐసియూలు, అప్పుడే పుట్టిన శిశువుల సంరక్షణకు అవసరమైన అన్ని సదుపాయాలు కల్పిస్తున్నామన్నారు. దీంతో లక్షలు వెచ్చించినా అందని వైద్యం ప్రభుత్వ దవాఖానాల్లో ఉచితంగా అందుతున్నదని మంత్రి తెలిపారు. గతంలోనూ భూపాలపల్లి కలెక్టర్ ఇలాగే చేసి ప్రభుత్వ దవాఖానాల ఔన్నత్యాన్ని పెంచారన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు, ప్రత్యేకించి వైద్యశాఖ వాళ్ళకు తన చర్య ద్వారా ఆదర్శంగా నిలిచావంటూ, భద్రాద్రి కొత్తగూడెం వైద్యాధికారి దయానంద్ ని మంత్రి ప్రత్యేకంగా అభినందించారు.
మరికల్ వైద్య సిబ్బందికి శుభాకాంక్షలు..
మహబూబ్నగర్ జిల్లాలో ఉత్తమ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంగా ఎంపికైన మరికల్ వైద్య సిబ్బంది, డాక్టర్లను సైతం మంత్రి అభినందించారు. ప్రతి నెలా 30 వరకు ప్రసూతిలు చేస్తూ, పరిశుభ్రత, రోగులకు ఉత్తమ
సేవలు అందించడంలో ముందున్నందుకు శుభాకాంక్షలు తెలిపారు. మరికల్ దవాఖానాను ఆదర్శంగా తీసుకుని మిగతా దవాఖానాలు కూడా మంచి వైద్యం పేదలకు అందించాలని సూచించారు.మరోవైపు మిడ్జిల్ దవాఖానా పనితీరుకి నాలుగు అవార్డులు గెలుచుకోవడం పట్ల మంత్రి లక్ష్మారెడ్డి ఆ వైద్యశాల సిబ్బంది, వైద్యులను అభినందించారు. ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా వారు ఈ అవార్డులు గెలుచుకోవడం అభినందనీయమని అన్నారు.
—-