ఓడిపోతున్న ప్రజాస్వామ్యాన్ని చూసి దేశం విచారిస్తోంది

– కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ
న్యూఢిల్లీ, మే17(జ‌నం సాక్షి) : కర్ణాటకీయానికి తెరపడింది. ముఖ్యమంత్రిగా భాజపా నేత యడ్యూరప్ప గురువారం ప్రమాణస్వీకారం చేశారు. ఎన్నికల్లో అతిపెద్ద పార్టీగా అవతరించిన భాజపాను ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిందిగా గవర్నర్‌ ఆహ్వానించడంతో రెండు రోజుల ఉత్కంఠ ముగిసింది. అయితే గవర్నర్‌ నిర్ణయంపై కాంగ్రెస్‌ నేతలు మండిపడుతున్నారు. యడ్డీ ప్రమాణస్వీకారానికి వ్యతిరేకంగా అసెంబ్లీ ఎదుట నిరసన చేపట్టారు. తాజాగా ఆ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ కూడా భాజపాపై ధ్వజమెత్తారు.
కర్ణాటక ఎన్నికల ఫలితాల నాటి నుంచి మౌనంగా ఉన్న రాహుల్‌గాంధీ.. ఎట్టకేలకు తాజా పరిస్థితులపై పెదవి విప్పారు. ట్విటర్‌ వేదికగా భాజపాపై మరోసారి విమర్శలు చేసిన రాహుల్‌.. ఆ పార్టీ రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తోందని దుయ్యబట్టారు. ‘భాజపాకు తగినంత సంఖ్యాబలం లేకపోయినా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని పట్టుబట్టింది. ఇది రాజ్యాంగాన్ని అపహాస్యం చేయడమే. గురువారం ఉదయం భాజపా తన బూటకపు విజయంపై సంబరాలు చేసుకుంటుంటే.. ఓడిపోతున్న ప్రజాస్వామ్యాన్ని చూసి దేశం విచారిస్తోంది’ అని రాహుల్‌గాంధీ ట్వీట్‌ చేశారు.