ఓపెనర్‌ రోహిత్‌ వీరవిహారం

వరుసగా రెండో సెంచరీ
విశాఖపట్నం,అక్టోబర్‌5 (జనంసాక్షి) : టెస్టుల్లో ఓపెనర్‌గా అరంగేట్రం చేసిన రోహిత్‌ శర్మ చెలరేగి ఆడుతున్నాడు. తొలి ఇన్నింగ్స్‌లో 176 పరుగులతో విజృంభించిన రోహిత్‌ సెకండ్‌ ఇన్నింగ్స్‌లో శతకంతో ఆకట్టుకున్నాడు. ప్రస్తుత టెస్టులో రోహిత్‌కిది రెండో సెంచరీ కావడం విశేషం. కేవలం 133 బంతుల్లో 9ఫోర్లు, 4 సిక్సర్లతో 100 మార్క్‌ చేరుకున్నాడు. ఓవరాల్‌గా టెస్టులో హిట్‌మ్యాన్‌కు ఇది ఐదో సెంచరీ. టెస్టుల్లో ఓపెనర్‌గా బరిలో దిగి ఒకే టెస్టులో రెండు శతకాలు బాదిన తొలి క్రికెటర్‌గా రోహిత్‌ చరిత్ర సృష్టించాడు. రోహిత్‌ కెరీర్‌లో వైజాగ్‌ టెస్టు ప్రత్యేకంగా నిలువనుంది. సుధీర్ఘ ఫార్మాట్‌లో ఓపెనర్‌గా సంచలన ప్రదర్శన చేసి కెరీర్‌లో కొత్త అధ్యాయాన్ని లిఖించాడు. టీ విరామం అనంతరం స్వల్ప వ్యవధిలోనే పుజారా(81: 148 బంతుల్లో 13ఫోర్లు, 2సిక్సర్లు) ఎల్బీడబ్లూగా వెనుదిరిగాడు. ప్రస్తుతం 54 ఓవర్లు ముగిసేసిరికి భారత్‌ రెండు వికెట్ల నష్టానికి 210 పరుగులు చేసింది. రోహిత్‌(105), జడేజా(8) క్రీజులో ఉన్నారు. తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యం కలుపుకొని టీమ్‌ ఇండియా 281 పరుగుల ఆధిక్యంలో ఉంది.
సౌతాఫ్రికాతో తొలి టెస్టులో భారత బ్యాట్స్‌మెన్‌ రోహిత్‌ శర్మ, పుజారా జోడీ టీ విరామ సమయానికి 154 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పింది. దీంతో భారత్‌కు 246 పరుగుల ఆధిక్యం లభించింది. శనివారం ఆట రెండో సెషన్‌లో సఫారీలకు ఒక్క వికెట్‌ కూడా దక్కలేదు. ఈ సెషన్‌లో పూర్తిగా భారత బ్యాట్స్‌మెన్‌ పూర్తి ఆధిపత్యం ప్రదర్శించారు. వేగంగా బ్యాటింగ్‌ చేస్తూ వీలైనన్ని పరుగులు రాబడుతున్నారు. రెండో ఇన్నింగ్స్‌లో కనీసం 250 పరుగులు చేసి ప్రత్యర్థికి భారీ లక్ష్యాన్ని నిర్దేశిరచాలని కోహ్లీసేన భావిస్తోంది. సెకండ్‌ ఇన్నింగ్స్‌లో 48 ఓవర్లు ఆడిన భారత్‌ వికెట్‌ నష్టానికి 175 పరుగులు చేసింది. రోహిత్‌(84), పుజారా(75) శతకం దిశగా దూసుకెళ్తున్నారు. ఎలాగైనా ఈ జోడీని విడదీయాలని సఫారీ బౌలర్లు చెమటోడ్చుతున్నారు.