ఔటర్‌పై కారు దగ్ధం

– మంటల్లో వ్యక్తి సజీవదహనం
హైదరాబాద్‌, ఫిబ్రవరి20(జ‌నంసాక్షి) : సంగారెడ్డి జిల్లా అవిూన్‌పూర్‌ మండలం సుల్తాన్‌పూర్‌ అవుటర్‌  రహదారి (ఓఆర్‌ఆర్‌)పై బుధవారం ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. కారులో మంటలు చెలరేగడంతో వ్యక్తి సజీవదహనమయ్యాడు. అవుటర్‌పై వెళుతుండగా కారులో ఒక్కసారిగా మంటలు చేలరేగాయి. కారుకు మంటలు అంటుకోవడం చూసిన ఇతర వాహనదారులు ఆర్పే ప్రయత్నం చేసినప్పటికీ ఫలితం లేకపోయింది. డోర్లు తెరుచుకోకపోవడంతో మంటల్లో చిక్కుకున్న వ్యక్తి చూస్తుండగానే కాలి బూడిదయ్యాడు.
దీంతో డ్రైవర్‌ సీట్లో ఉన్న అతడు మంటల్లో కాలిపోయాడు. మరో ఇద్దరు తీవ్ర గాయాలతో బయటపడినట్లు తెలిసింది. కారు దగ్ధమవుతోందన్న సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన తరలివచ్చి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. టీఎస్‌ 07 జీఎం 4666 నెంబర్‌ గల కారులో ఔటర్‌ రహదారిపై బొల్లారం వైపు నుంచి ముత్తంగి వైపునకు వెళుతుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. పోలీసులు సంఘటనా స్థలికి చేరుకుని కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కాగా ఈ వాహనం మియాపూర్‌కు చెందిన శ్రీదేవి పేరు విూద ఉంది.