కథువా ఘటనను ఖండించిన కోవింద్‌

శ్రీనగర్‌: జమ్మూ-కశ్మీర్‌లోని కథువాలో ఎనిమిదేళ్ల బాలికపై జరిగిన అత్యాచారం పట్ల అందరూ సిగ్గు పడాలని రాష్ట్రపతి రామ్‌ నాథ్‌ కోవింద్‌ అన్నారు. కత్రాలో జరిగిన శ్రీమాతా వైష్ణోదేవి విశ్వవిద్యాలయం ఆరో స్నాతకోత్సవంలో ఆయన బుధవారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ… ‘స్వాతంత్య్రం వచ్చిన 70ఏళ్ల తర్వాత కూడా చిన్నారులపై ఇలాంటి దారుణాలు జరుగుతున్నాయంటే మన సమాజం ఎటుపోతోందో ఆలోచించుకోవాలి. స్త్రీలను, మహిళలను జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన బాధ్యత మనపై ఉంది. ముఖ్యంగా కథువాలో జరిగిన దుర్ఘటనపై భారతీయులందరూ సిగ్గు పడాలి. ఇకపై ఇలాంటి అఘాయిత్యాలు ఎక్కడా జరక్కుండా చూసుకోవాలి. ఈ మధ్య చిన్నారులపై జరగుతోన్న దారుణాలు ఒళ్లు గగుర్పొడిచేలా ఉన్నాయి. ఆడపిల్లలకు ఒంటరిగా తిరిగే స్వేచ్ఛనిచ్చి, ఇప్పుడు వాళ్లపై పైశాచికం చూపడం అత్యంత దారుణమైన చర్య. దీనికి చరమగీతం పాడాలి’ అని అన్నారు.

అనంతరం జమ్మూ-కశ్మీర్‌ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తి మాట్లాడుతూ…‘ చిన్నారుల పట్ల అంత కర్కశంగా ఎలా ప్రవర్తించగలరు? పిల్లలు సాక్షాత్తూ వైష్ణోదేవి ప్రతిరూపాలు. ఇలాంటి పసిమొగ్గలపై ప్రతాపం చూపడం ఎంతమాత్రం సరికాదు’ అన్నారు.

జనవరి 10న కథువాకు చెందిన ఎనిమిదేళ్ల చిన్నారిని ఇంటినుంచి అపహరించుకుపోయారు. ఇది జరిగిన వారం తర్వాత రసానా గ్రామంలోని అడవుల్లో చిన్నారి శవమై కనిపించింది. దీనిపై చార్జిషీటు దాఖలు చేసిన పోలీసులు చిన్నారిపై అత్యాచారం చేసి చంపినట్లు తెలిపారు. ప్రస్తుతం ఈ ఘటన దేశాన్ని కుదిపేస్తోంది. చిన్నారికి న్యాయం చేయాలని దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి.