కమల్‌ హాసన్‌కు..  మద్రాస్‌ హైకోర్టులో ఊరట

– ముందస్తు బెయిల్‌ మంజూరు
చెన్నై, మే20(జ‌నంసాక్షి) : మద్రాస్‌ హైకోర్టులో సినీ నటుడు, మక్కల్‌ నీది మయ్యం చీఫ్‌ కమల్‌ హసన్‌కు ఊరట లబించింది. నాథూరాం గాడ్సేపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కమల్‌ హాసన్‌కు ముందస్తు బెయిల్‌ లభించింది. మద్రాస్‌ హైకోర్టు మధురై ధర్మాసనం ఈ మేరకు సోమవారం తీర్పు వెలువరించింది. ఇటీవల ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతూ.. కమల్‌ హిందూ తీవ్రవాదం అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ‘స్వతంత్ర భారతంలో తొలి తీవ్రవాది ఓ హిందువు. ఆయన పేరు నాథూరామ్‌ గాడ్సే’ అని అన్నారు. కమల్‌ వ్యాఖ్యలపై హిందూ సంఘాల నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయనపై చర్యలు తీసుకోవాలంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కమల్‌కు వ్యతిరేకంగా 76 ఫిర్యాదులు రాగా.. రెండు కేసులు నమోదయ్యాయి. అయితే, ఈ కేసుల్లో ముందస్తు బెయిల్‌ కోరుతూ మద్రాసు హైకోర్టులో కమల్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. తనపై వస్తున్న ఆరోపణలు అవాస్తవమని, తీవ్రవాదులు అన్ని మతాల్లో ఉన్నారని చెప్పే ప్రయత్నంలోనే ఆ వ్యాఖ్యలు చేసినట్లు కమల్‌ పేర్కొన్నారు. దీనిపై నేడు విచారణ చేపట్టిన న్యాయస్థానం ఆయన అభ్యర్థనను అంగీకరించింది. కమల్‌ను అరెస్టు చేయకుండా కోర్టు ముందస్తు బెయిల్‌ మంజూరు చేసింది