కరీంనగర్‌లో జల్లెడ

7 కరోనా పాజిటివ్ కేసులతో హైఅలర్ట్

నగరంలో వంద బృందాలతో సేవలు

కరీంనగర్, మార్చి 19(జనంసాక్షి): ఇటీవల కరీంనగర్ కు వచ్చిన విదేశీ వ్యక్తుల్లో మొత్తం 8 మందిలో కరోనా వ్యాధి ఉన్నట్లు నిర్ధారణ కావడంతో జిల్లా ప్రజల్లో కాస్త ఆందోళన కనిపిస్తోంది. కరీంనగర్ కేంద్రంతో పాటు ఈ బృందం పర్యటించిన ఇతర ప్రాంతాలపైనా అధికారులు ఆరా తీస్తున్నారు. వారు నగరంలో ఉన్న మూడు రోజులో ఎవరెవరిని కలిశారు? ఏయే ప్రాంతాల్లో సంచరించారు? అనే విషయాలపై అధికారులు ఆరా తీస్తున్నారు. అయితే, వీరు కలెక్టరేటకు అతి సమీపంలోని ప్రార్థనా మందిరాలకు వెళ్లినట్లుగా తెలుస్తోంది. మార్చి 14, 15 తేదీల్లో పట్టణంలోని కొన్ని ప్రాంతాల్లోనూ వీరు సంచారించారని అధికారులు గుర్తించారు. ఇంకా వీరు తిరిగిన ప్రాంతాలను తెలుసుకొనేందుకు పోలీసులు సీసీటీవీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. ఈ నెల 16న కరోనా పరీక్షల నిమిత్తం 12 మందిని వైద్య పరీక్షలకు హైదరాబాద్ తరలించగా.. మార్చి 18న మరో 9 మందిని తీసుకొచ్చారు. ఈ వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు జిల్లా అధికారులు ఇండోనేసియా బృందంతో సన్నిహితంగా ఉన్నవారి కోసం గాలింపు మొదలు పెట్టారు. ప్రస్తుతం రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 13కు చేరింది. 100 ప్రత్యేక టీమ్ లు ముందస్తు చర్యల్లో భాగంగా ఇండోనేసియా బృందం కరీంనగర్‌లో సంచరించిన ప్రాంతాలన్నింటినీ తమ ఆధీనంలోకి తీసుకునేలా పోలీసులు కార్యాచరణను సిద్ధం చేశారు. గురువారం నుంచి కరీంనగర్ లో 100 ప్రత్యేక వైద్య బృందాలతో ఇంటింటికి వెళ్లి పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించారు. ఇందుకోసం అన్ని ఏర్పాట్లు చేసినట్లుగా వెల్లడించారు. వీలునిబట్టి ఆయా ప్రాంతాల్లో కఠినతర ఆంక్షలు విధించాలని భావిస్తున్నారు. ఈ వ్యవహారంపై మంత్రి గంగుల కమలాకర్ జిల్లా కలెక్టర్ శశాంక, నగర సీపీ, వైద్య ఉన్నతాధికారులతో అత్యవసర రివ్యూ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సమస్య తీవ్రతను ప్రజలు గుర్తించాలని, ప్రతి ఒక్కరూ స్వీయజాగ్రత్తలు పాటించాలని కోరారు. ఇండోనేసియా టీమ్ కలెక్టరేట్ ప్రాంతంలో రెండు రోజుల పాటు ఉండడంతో చుట్టుపక్కల మూడు కిలోమీటర్ల మేర ప్రతి ఒక్కరికీ వైద్య పరీక్షలు చేస్తామని తెలిపారు. కరీంనగర్ లో నిత్యావసర దుకాణాలు మినహా మిగిలిన షాపులు, ఇతర సంస్థలు మూసివేస్తేనే మంచిదని సూచించారు. అందరూ విధిగా ఇంటి వద్దే ఉండడం మంచిదని చెప్పారు. తప్పనిసరి పరిస్థితి అయితే తప్ప ఇంట్లో నుంచి ఎవరూ బయటకు రావొద్దని ఆదేశాలు జారీ చేశారు.