కశ్మీర్‌ అంశంపై చర్చిద్దాం!

– ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక చర్చలను పునరుద్ధరిద్దాం
– ప్రధాని మోదీని పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ లేఖ?
న్యూఢిల్లీ, మే3(జ‌నంసాక్షి) : కశ్మీర్‌తో పాటు ఇరు దేశాల మధ్య నెలకొన్న ఇతర సమస్యల పరిష్కారానికి ద్వైపాక్షిక చర్చల పునరుద్ధరణ ఎంతో ముఖ్యమని, ఆమేరకు చర్చలను కొనసాగిద్దామని పాకిస్థాన్‌ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ భారత ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాసినట్లు తెలుస్తుంది. ఈ మేరకు ఓ ప్రముఖ ఆంగ్ల పత్రిక పేర్కొంది. పాకిస్థాన్‌ జాతీయ దినోత్సవం సందర్భంగా మార్చి 23న మోదీ పంపిన సందేశానికి సమాధానంగా ఆయన ఈ లేఖ రాసినట్లు సమాచారం. ఇదిలా ఉంటే లేఖలో ఎక్కడా ఉగ్రవాదంపై చర్యల ప్రస్తావన లేకపోవడం గమనార్హం. కశ్మీర్‌ అంశంపై చర్చిద్దామని ప్రతిపాదించినప్పటికీ.. తమ వైఖరిని మాత్రం ఇమ్రాన్‌ ఎక్కడా ప్రస్తావించలేదు. ఇరు దేశాల మధ్య చర్చలకు పాకిస్థాన్‌ సుముఖంగా ఉన్నప్పటికీ.. భారత్‌ మాత్రం అందుకు సిద్ధంగా లేదని ఈ అంశంతో సంబంధం ఉన్న ఓ ఉన్నతాధికారి తెలిపారు. రాబోయే ప్రభుత్వం పాక్‌తో చర్చలపై సానుకూలంగా ఉండే అవకాశం లేదని అభిప్రాయపడ్డారు. గత సెప్టెంబరులో మోదీకి రాసిన లేఖలోనూ ఇమ్రాన్‌ చర్చలకు పిలుపునిచ్చారు. అందుకు తొలుత అంగీకరించినా.. పాక్‌ వక్రబుద్ధితో ఒక్కరోజులోనే తమ నిర్ణయాన్ని భారత్‌ వెనక్కి తీసుకున్న విషయం తెలిసిందే. కశ్మీర్‌ సరిహద్దుల్లో ఓ బీఎస్‌ఎఫ్‌ జవాన్‌, ముగ్గురు ఎస్పీవోలను పాక్‌ దారుణంగా హతమార్చడంతో చర్చలను రద్దు చేసుకుంది. ఉగ్రవాదంపై పాక్‌ ప్రభుత్వం పటిష్ఠ చర్యలు తీసుకునే వరకు ఎలాంటి చర్చలు ఉండవని స్పష్టం చేసింది. పాక్‌ జాతీయ దినోత్సవం సందర్భంగా ఇమ్రాన్‌కు మోదీ లేఖ రాస్తూ.. ఈ ప్రాంతంలో సుస్థిర అభివృద్ధి, శాంతి భద్రతల స్థాపనకు ఇరు దేశాలు కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు. అలాగే ఇమ్రాన్‌ గత నెల అంతర్జాతీయ విూడియాతో మాట్లాడుతూ.. మోదీ మరోసారి ప్రధాని అయితే ఇరు దేశాల మధ్య చర్చలకు మెరుగైన అవకాశాలు ఉంటుందని వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.