కసాయి తల్లి..!


– ఇటుకతో ఇద్దరు కొడుకులపై తల్లి దాడి
– దాడిలో ఒకరు మృతి, మరొక కుమారుడికి తీవ్ర గాయాలు
– గోదావరిఖనిలో దారుణ ఘటన
– దాడిచేసిన రమాదేవిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
పెద్దపల్లి, మార్చి4(జ‌నంసాక్షి) : పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో దారుణం జరిగింది. కన్నబిడ్డలపాలిట తల్లి కసాయిగా మారింది. ఇటుక రాయితో ఇద్దరు కొడుకులపై దాడి చేసింది. ఈ దాడిలో ఒకరు చనిపోగా.. మరొకరు ఆస్పత్రిలో మృత్యువుతో పోరాడుతున్నారు. ఈ ఘటన సోమవారం చోటు చేసుకుంది. నిందితురాలు కొద్దిరోజులుగా మానసిక వ్యాధితో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. గోదావరిఖని సప్తగిరి కాలనీకి చెందిన శ్రీకాంత్‌, రమాదేవి దంపతులకు అజయ్‌, ఆర్యలు సంతానం. శ్రీకాంత్‌ ఎన్టీపీసీలో ఉద్యోగం చేస్తున్నాడు. కొద్దిరోజులు ప్రైవేట్‌ స్కూల్‌లో టీచర్‌గా పనిచేసిన రమాదేవికి కొద్దిరోజులుగా మానసిక స్థితి సరిగా లేదని స్థానికులు తెలిపారు. తరచూ భర్త, ఇద్దరు పిల్లతో గొడవపడుతుండేదని, స్కూల్‌లో కూడా పిల్లలతో దురుసుగా ప్రవర్తించడంతో ఉద్యోగం నుంచి తొలగించారని తెలిసింది. తర్వాత భర్త ఆమెను మానసిక వైద్యులకు చూపించారని, సోమవారం ఉదయం భర్త శివరాత్రి పూజా సామాగ్రి కొనుగోలు చేసేందుకు బయటకు వెళ్లాడని, కొద్దిసేపటికి రమాదేవి ఇద్దరు పిల్లలపై ఇటుకరాయితో దాడి చేసిందని స్థానికులు తెలిపారు. ఈ దాడిలో పెద్ద కుమారుడు అజయ్‌ అక్కడికక్కడే చనిపోగా.. చిన్నకుమారుడు అజయ్‌ రక్తపు మడుగులో పడి పెద్దగా కేకలు వేశాడని, వెంటనే చుట్టుపక్కలవారు రాగా.. శ్రీకాంత్‌ కూడా బయట నుంచి తిరిగొచ్చాడని తెలిపారు. ప్రాణాప్రాయ స్థితిలో ఉన్న రెండవ కుమారుడు ఆర్యను చికిత్స నిమిత్తం కరీంనగర్‌లోని ఆస్పత్రికి తరలించారు. అతడి పరిస్థితి కూడా విషమంగా ఉందని డాక్టర్లు చెబుతున్నారు. రమాదేవిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. కాగా ఒక కుమారుడి మృతిచెందగా, మరొక కుమారుడు ప్రాణాప్రాయ స్థితిలో కొట్టుమిట్టాడుతుండటంతో తండ్రి, కుటుంబ సభ్యుల రోధనలతో విషాధం అలముకుంది.