కాంగ్రెస్‌పార్టీ ఆధ్వర్యంలో సంబరాలు

ఖమ్మం,మార్చి02(జ‌నంసాక్షి): పీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా మధిర ఎమ్మెల్యే మల్లు భట్టి విక్రమార్క నియామకంతో రాష్ట్రంలో కాంగ్రెస్‌ మరింత బలోపేతమవుతుందని డీసీసీ అధ్యక్షుడు ఐకం సత్యం పేర్కొన్నారు. స్థానిక కాంగ్రెస్‌ కార్యాలయంలో సోమవారం ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. భట్టి విక్రమార్కకు వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా నియమించినందుకు ఆయన హర్షం వ్యక్తం చేసి పార్టీ అధినాయకురాలు సోనియా, రాహుల్‌ గాంధీలకు కృతజ్ఞతలు తెలిపారు. తెరాస ప్రభుత్వం చేపడుతున్న ప్రజా వ్యతిరేక విధానాలను జిల్లా, రాష్ట్రంలోని కాంగ్రెస్‌ నాయకులు కలిసికట్టుగా ఎండగట్టాలన్నారు. కాంగ్రెస్‌ బలపరిచిన గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ అభ్యర్థి మల్లన్నకు ఓట్లు వేసి గెలిపించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో బ్లాక్‌, మండల కాంగ్రెస్‌ అధ్యక్షులు చావా వేణు, ఎస్‌ కిషోర్‌, జిల్లా ఎ/-టసీ సెల్‌అధ్యక్షుడు బాలాజీ రావు, కాంగ్రెస్‌ కార్యకర్తలు పాల్గొన్నారు. ఇక మధిర శాసనసభ్యుడు మల్లు భట్టి విక్రమార్కను తెలంగాణ కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ అధ్యక్షుడిగా నియమించటంతో ఎరుపాలెంలో ఆ పార్టీ నాయకులు సంబరాలు చేసుకున్నారు. మిఠాయిలు పంచుకుని ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి కృతజ్ఞతలు చెప్పారు. ఇదిలావుంటే ఎరిపాలెం రెవెన్యూ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన పరిష్కృతి కార్యక్రమంలో ఫిర్యాదులందాయి. జములాపురం గ్రామానికి చెందిన గుగులోతు లక్ష్మణ్‌ మృతి చెందటంతో వారసత్వ హక్కు కల్పించాలని కుమారుడు బాలూనాయక్‌ ఫిర్యాదు చేశారు.అలాగే పాస్‌పుస్తకాలు, ఈ-పహానీలకు సంబంధించి ఫిర్యాదు అధికంగా వచ్చాయి. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.