కాంగ్రెస్‌ అధికారంలోకి రావాలని..  ప్రజలు కోరుకుంటున్నారు

– టీడీపీ, వైసీపీకి సామాజిక స్పృహ లేదు
– ఏపీ పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి
ఒంగోలు, ఫిబ్రవరి25(జ‌నంసాక్షి) : ప్రస్తుత అధికార, ప్రధాన ప్రతిపక్ష పార్టీలుగా ఉన్న టీడీపీ, వైసీపీలకు సామాజిక స్పృహ లేదని, కాంగ్రెస్‌ అధికారంలో ఉంటేనే అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు తీరుతాయని ప్రజలు కోరుకుంటున్నారని ఏపీ పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి అన్నారు. సోమవారం ఆయన ప్రకాశం జిల్లాలో కాంగ్రెస్‌ ప్రత్యేక ¬దా భరోసా యాత్ర లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..
కాంగ్రెస్‌ అధికారంలోకి రావాలని ప్రజలు కోరుకుంటున్నారని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు పూర్తి అభద్రతాభావంలో ఉన్నారని అన్నారు. టీడీపీ, వైసీపీకి సామాజిక స్పృహ లేదని విమర్శించారు. రాష్ట్రంలో బలహీనవర్గాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. బలహీనవర్గాలపై బీజేపీ కక్షగట్టిందని రఘువీరా విమర్శించారు. మైనార్టీలు, దళితులపై దాడులు పెరిగాయని, మైనార్టీలు, దళితుల హక్కులను అణిచివేస్తున్నారని ఆయన ఆరోపించారు.
కాంగ్రెస్‌ బలపడితేనే అణగారిన వర్గాలకు న్యాయం జరుగుతుందని రఘువీరారెడ్డి అన్నారు. అన్నివర్గాలకు కాంగ్రెస్‌ ప్రాధాన్యమిస్తుందని, బలహీనవర్గాలు కాంగ్రెస్‌తో కలిసి రావాలని పిలుపు ఇచ్చారు. టీడీపీ, వైసీపీలో బలహీనవర్గాలు ద్వితీయశ్రేణి పౌరులుగా ఉన్నారని, దేశంలో రెండు పార్టీలు తప్ప మిగతా పార్టీలన్నీ కాంగ్రెస్‌ వెంటే ఉన్నాయన్నారు. ఏపీ రాష్ట్రంలో బీజేపీ ఊసే లేదని.. బీజేపీకి ఓట్లు పడవన్నారు. తెలంగాణలో టీడీపీతో కలిసినంత మాత్రాన ఇక్కడా కలవాలని లేదని రఘువీరా అభిప్రాయం వ్యక్తం చేశారు.