కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తుంది: రమేశ్‌ రాథోడ్‌

ఆదిలాబాద్‌,మే22(జ‌నంసాక్షి): కేంద్రంలో కచ్చితంగా కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తుందని ఆ పార్టీ ఆదిలాబాద్‌ ఎంపీ అభ్యర్థి రమేష్‌ రాఠోడ్‌ అన్నారు. ఎగ్జిట్‌ పోల్స్‌పై తమకు నమ్మకం లేదని, వాటి విశ్వసనీయయత అంత ఖచ్చితంగా లేదన్నారు. మళ్లీ కేంద్రంలో భాజపా వస్తోందని సంబరాలు చేసుకోవడం సరికాదన్నారు.  తెలంగాణలో కారు పంక్చర్‌ అవుతుందని ఎద్దేవా చేశారు. ఈవీఎంలను ట్యాంపరింగ్‌ చేసేందుకు చేస్తున్న కుట్రలో భాగమే ఎగ్జిట్‌పోల్స్‌ అని దుయ్యబట్టారు. తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీ ఎక్కువ ఎంపీ స్థానాలను గెల్చుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. మరోవైపు ఫలితాలపై
అభ్యర్థులు, ఆయా పార్టీల శ్రేణుల్లో ఉత్కంఠ నెలకొంది. ఫలితం ఎలా ఉండనుందనే ఆందోళన ప్రధాన పార్టీల వారిని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఎలాగైనా గెలిచి తీరుతామని పైకి అభ్యర్థులు ధీమాను చూపుతున్నా.. లోలోపల మాత్రం కంగారుగానే ఉన్నారు. ఇక దీనికితోడు ఎగ్జిట్‌పోల్‌ విషయంలోనూ ఇక్కడి సీటు విషయమై భిన్నమైన వాదనలు వినిపిస్తుండటంతో అందరిలోనూ ఆవేదన క్రమంగా పెరుగుతోంది. ఎవరికి వారుగా లెక్కలేసుకుంటున్నా నేడు వెలువడే అసలు ఫలితం ఎలా ఉంటుందో అన్న ఆందోళనలో ఉన్నారు.
గోడం నగేశ్‌, రాథోడ్‌ బాపూరావు, రమేశ్‌ రాథోడ్‌ ప్రధానంగా పోటీ పడ్డారు. పోటీలో ముగ్గురు ప్రధాన పార్టీల అభ్యర్థులున్నా.. అధికార తెరాసతోపాటు కాంగ్రెస్‌,భాజపా మధ్య గట్టి పోటీ ఉంటుందనే ప్రచారం ఊపందుకుంది. మొదటి నుంచి మూడు ప్రధాన పార్టీల అభ్యర్థులు గెలుపు కోసం విపరీతంగా శ్రమించారు.