కాంగ్రెస్‌ కూటమికి ఓటేస్తే తెలంగాణ ఎడారే

నిరంతర కరెంట్‌కు గండిపడడం ఖాయం
ప్రచారంలో హెచ్చరించిన మంత్రి జగదీశ్వర్‌ రెడ్డి
సూర్యాపేట,డిసెంబర్‌1(జ‌నంసాక్షి): కాంగ్రెస్‌ కూటమికి ఓటేస్తే తెలంగాణ ఎడారి  అవుతుందని మంత్రి జగదీశ్వర్‌ రెడ్డి పేర్కొన్నారు. ఓటు వేసే ముందు ప్రజలు ఒక్కసారి ఆలోచించుకోవాలి. గత పాలన ఎట్లా ఉండే? నాలుగేళ్ల టీ ఆర్‌ ఎస్‌ పాలన ఎలా ఉంది? అని ప్రశ్నించుకోని ఓటేయాలన్నారు.  ఆత్మకూర్‌(ఎస్‌) మండలం దుబ్బతండాలో మంత్రి  ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా 300 మంది కాంగ్రెస్‌, బీజేపీ నేతలు, కార్యకర్తలు మంత్రి జగదీశ్‌ రెడ్డి సమక్షంలో టీఆర్‌ఎస్‌ లో చేరారు. అనంతరం మంత్రి జగదీశ్‌ రెడ్డి మాట్లాడుతూ..  ఎక్కడా లేని విధంగా 24 గంటల కరెంట్‌ ఇస్తున్నామని తెలిపారు. కాంగ్రెస్‌ హయాంలో కరెంట్‌ కోతలు రైతులను వేధించే విషయాన్‌ఇన మరచిపోరాదన్నారు. . రైతు సంక్షేమమే కేసీఆర్‌ ధ్యేయమని మంత్రి ఉద్ఘాటించారు. మళ్లీ అధికారంలోకి రాగానే రూ. లక్ష రుణమాఫీ
చేస్తామన్నారు.  కాళేశ్వరం పూర్తి కావాలంటే.. మళ్లీ కేసీఆరే సీఎం కావాలి అని జగదీశ్‌ రెడ్డి చెప్పారు.
గత పాలకులు 60ఏండ్లపాటు తెలంగాణను ఆగం చేసిండ్రు.. ఎన్నో పోరాటాల అనంతరం రాష్ట్రాన్ని సాధించుకోని బంగారు తెలంగాణగా రూపుదిద్దుకుంటన్న తరుణంలో తిరిగి పెత్తనం చేయాలనే దురాశతో మహాకూటమి పేరుతో మాయకూటమిగా మారి ఎన్నికల్లో తలబడుతున్న అలాంటి మాయకూటమికి ఓట్లు వేసి ఆగం కావొద్దని జగదీష్‌రెడ్డి పేర్కొన్నారు.  కాంగ్రెస్‌, టీడీపీ పార్టీలు ఏకమై  తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడానికి పూనుకున్నారని అన్నారు. 2014లో వేసిన ఓట్లతో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి పథంలో ఉందన్నారు. బంగారు తెలంగాణపై ఆంధ్రా పెత్తందారులైన చంద్రబాబు కన్ను పడిందని, కాళేశ్వరం ప్రాజెక్టును అడ్డుకున్నది చంద్రబాబునాయుడు కాదా అన్నారు. మహాకూటమికి ఓట్లు వేస్తే చంద్రబాబుకు ఓట్లు వేసినట్లే అన్నారు. తెలంగాన కాంగ్రెస్‌ నాయకులు సోయిలేక చాతకాక ఆంధ్ర బాబు చేతిలో తోలు బొమ్మలుగా, ఢిల్లీ చేతిలో కీలుబొమ్మలుగా మారడం సిగ్గుచేటన్నారు. కేసీఆర్‌ ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలు తిరిగి లబ్ది పొందాలంటే గులాబీ గూటికి చేరి కేసీఆర్‌ అడుగుజాడలో నడవాలని పిలుపునిచ్చారు. నియోజకవర్గం మరింత అభివృద్ధి జరగాలంటే టీఆర్‌ఎస్‌ను మళ్లీ అధిక మెజార్టీతో గెలుపించాలని పిలుపునిచ్చారు.