కాంగ్రెస్‌ నేతల చేరికతో కాంగ్రెస్‌ ఖాళీ: ఎమ్మెల్యే

సిద్దిపేట,మార్చి26(జ‌నంసాక్షి): కాంగ్రెస్‌పై ఆ పార్టీ నాయకులు, ఎమ్మెల్యేలకే విశ్వాసం లేదని, అలాంటిది ప్రజలు ఎలా నమ్ముతారని దుబ్బాక ఎమ్మెల్యే రామలింగారెడ్డి ప్రశ్నించారు. అందుకు ఆ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు, నేతలు మూకుమ్మడిగా టిఆర్‌ఎస్‌లో చేరుతున్నారని అన్నారు. దీనిని గమనించని కాంగ్రెస్‌ నేతలు కెసిఆర్‌ను విమర్శించి లాభం లేదన్నారు. ఆ పార్టీలో  పోటీచేసేందుకు అభ్యర్థులు ముందుకు రావడంలేదని ఎద్దేవా చేశారు. సీఎం కేసీఆర్‌ అమలుచేస్తున్న సంక్షేమ పథకాలను చూసి కాంగ్రెస్‌ నుంచి టీఆర్‌ఎస్‌లోకి భారీగా చేరికలు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. కాంగ్రెస్‌, బీజేపీలను ప్రజలు నమ్మటం లేదన్నారు. మెదక్‌ ఎంపీ అభ్యర్థి కొత్త ప్రభాకర్‌రెడ్డికి ఐదులక్షల ఓట్ల మెజార్టీ వచ్చేలా ప్రతి నాయకుడు, కార్యకర్త కృషి చేయాలని పిలుపునిచ్చారు. 16 ఎంపీ స్థానాల్లో టీఆర్‌ఎస్‌ విజయం ఖాయమని ధీమా వ్యక్తంచేశారు. ఈ పోటీ ఇతర పార్టీలతో కాదని, మనలో మనకే మెజార్టీ కోసమే పోటీ నెలకొన్నదని పేర్కొన్నారు. మెదక్‌ ఎంపీ విజయం రాష్ట్రానికే కాకుండా జాతీయస్థాయిలో ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చేందుకు ఈ ఎన్నికలు సువర్ణావకాశంగా మారిందని చెప్పారు.