కాంగ్రెస్‌ విమర్శలను సహించేది లేదు: ఎర్రబెల్లి

జనగామ,మే19(జ‌నం సాక్షి): కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో అధికారం అడ్డుపెట్టుకొని కోట్లకు పడగలెత్తారని, ఇప్పుడు కేసీఆర్‌ అమలు చేస్తున్న పథకాలను గుడ్డిగా విమర్శిస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించాలని చూస్తున్నారని ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌ రావు మండిపడ్డారు. రైతుబంధు పథకం విజయం కావడంతో వారికి నిద్రపట్టడం లేదన్నారు. పథకాల్లో ఏమైనా లోటుపాట్లుంటే వాటిని ప్రతిపక్షాలు ఎత్తిచూపితే వాటిని సరిచేసుకుంటామని అన్నారు.  కానీ పనిగట్టుకుని విమర్శలు చేస్తే చూస్తూ ఊరుకోమని అన్నారు. ఇప్పుడు పొరుగు రాష్ట్రాల  వాళ్లు మన పథకాలను ఆదర్శంగా తీసుకొని అమలు చేయాలని చూస్తున్నారని తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌ రైతులు కూడా ముఖ్యమంత్రి కేసీఆర్‌ వద్దకు వచ్చి ఈ పథకాన్ని తమ వద్ద అమలు చేసేలా చూడాలని వినతిపత్రం అందజేశారని తెలిపారు. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన రైతుబంధు పథకం విజయవంతమైందని, ఊరూరా చెక్కుల పంపిణీ పండుగ వాతావరణంలో జరిగిందని  హర్షం వ్యక్తం చేశారు. రైతులే హర్షం వ్యక్తం చేస్తూ సిఎం కెసిఆర్‌ను దీవిస్తున్నారని అన్నారు. ఈ పథకం కోసం నగదు కొరత ఏర్పడకుండా ఉండేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రత్యేక శ్రద్ధతో ఆర్‌బీఐతో మాట్లాడి చర్యలు తీసుకున్నారని అన్నారు.  నగదు బ్యాంకుల్లో అందుబాటులో ఉందని, మూడు నెలల వరకు నగదు తీసుకునే వీలుందని  పేర్కొన్నారు. ఎక్కడా అపశ్రుతి జరగలేదని సజావుగా కార్యక్రమం సాగిందని  చెప్పారు. రైతులు ఈ డబ్బులను కేవలం పెట్టుబడికి మాత్రమే వినియోగించుకోవాలని సూచించారు.