కాగజ్‌నగర్‌ మున్సిపాలిటీకి మంచి రోజులు

ఆదిలాబాద్‌,జూన్‌20(జ‌నం సాక్షి): సిర్పూర్‌ పేపర్‌ మిలు మూతపడడం, ఆస్తిపన్ను సక్రమంగా వసూలు కాకపోవడంతో కాగజ్‌నగర్‌ మున్సిపాలిటీకి నిధుల కొరత ఏర్పడింది. తాజాగా మళ్లీ పునరుద్దరణకుఅవకాశం ఏర్పడడంతో మళ్లీ సనిధులు రానున్నాయి. మూడేళ్లుగా ప్రభుత్వం ప్రత్యేకంగా విడుదల చేసిన గ్రాంట్లు మినహా, జనరల్‌ఫండ్‌ కింద ప్రత్యేకంగా నిధులు సమకూరకపోవడంతో ప్రతి పాలకవర్గ సమావేశంలోనూ సమస్యలపై అధికారులను నిలదీస్తూనే ఉన్నారు. దీంతో నిధులు లేక అభివృద్దిలో నీరసిందింది. ఒప్పంద కార్మికులకు ఆరు నెలలు, ఎన్‌ఎంఆర్‌ కార్మికులకు ఏడు నెలల వేతన బకాయిలు చెల్లించాల్సి ఉంది. ప్రభుత్వం ప్రత్యేక గ్రాంట్లు కింద రూ.60లక్షలు మంజూరు చేయగా, ఆ నిధులను విద్యుత్తు బిల్లులకు చెల్లించడంతో విద్యుత్తు సరఫరాను పునరుద్ధరించారు. పురపాలక సంఘం ఛైర్‌పర్సన్‌ కోసం కొన్ని నెలలుగా వాహనం అద్దె ప్రతి నెల రూ.24 వేలు చెల్లిస్తున్నట్టు సమాచారం. అయితే ఛైర్‌పర్సన్‌ తన సొంత వాహనానికే ఈ అద్దె తీసుకుంటు న్నట్టు తెలిసింది. గతంలో పురపాలకసంఘం ఛైర్మన్లుగా కొనసాగిన సులేమాన్‌, దస్తగీర్‌ సైతం తమ హయాంలో సొంత వాహనాలకే బల్దియా నుంచి అద్దె రూపంలో బిల్లులు తీసుకున్నారు. ఈ విషయం అప్పుడు వివాదాస్పదమైంది. ప్రత్యేకాధికారి అనుమతి లేకుండానే ఈ బిల్లులను తీసుకున్నారు. విచారణ జరిపిన అనంతరం వారి వేతనాల నుంచి వాహనాల అద్దె పేరిట తీసుకున్న డబ్బులను రికవరీకి చేయాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. అయితే ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా వాహనం అద్దె ప్రతిపాదనలను ఉపసంహరించుకున్నామని ఇటీవలే కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టిన తిరుపతి ప్రకటించారు.