కారుణ్య మరణానికి అనుమతివ్వండి

హైకోర్టును వేడుకున్న రాజీవ్‌ హంతకురాలు నళిని

చెన్నై,డిసెంబర్‌2(జ‌నంసాక్షి): మాజీ ప్రధానమంత్రి దివంగత రాజీవ్‌ గాంధీ హత్య కేసులో జైలులో ఉంటున్న ముద్దాయిలైన నళిని, ఆమె భర్త మురుగన్‌లు కీలక నిర్ణయం తీసుకున్నారు. కారుణ్య మరణానికి అనుమతి ఇవ్వాలంటూ కోరుతున్నారు. ఈ మేరకు వారు మద్రాసు హైకోర్టును ఆశ్రయించారు. ఇదే అంశంపై వారిద్దరూ గత నెల 27వ తేదీన ప్రధాని నరేంద్ర మోడీతో పాటు మద్రాసు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ అమరేశ్వర్‌ ప్రతాప్‌కి నళిని లేఖ రాశారు. తీవ్రమైన ఒత్తిడి కారణంగానే నళిని ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆమె తరపు లాయర్‌ పుగళేంది పేర్కొన్నారు. జైలు అధికారుల సాయంతో ప్రధాని మోడికి నళిని లేఖ రాశారని ఆయన తెలిపారు. ‘మేము విడుదలవుతామని గత 26 ఏళ్లుగా నిరీక్షిస్తున్నాం. ఇప్పుడు ఆ ఆశలన్నీ ఆవిరవుతున్నాయి. జైలు అధికారులు నా భర్త మురుగన్‌ను తీవ్ర ఇబ్బందులు పెడుతున్నారు. వారు నా భర్తను పెడుతున్న బాధలు చూడలేకపోతున్నాను. అందువల్ల మా కారుణ్య మరణానికి అనుమతించండి’ అని ప్రధాని మోడీకి రాసిన లేఖలో విజ్ఞప్తి చేసింది. కాగా, రాజీవ్‌ గాంధీ హత్య కేసులో దోషులుగా తేలిన వారిందరికీ ఉరిశిక్షలు పడ్డాయి. అయితే, కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియా గాంధీ కుటుంబ సభ్యులు వారిని క్షమించడంతో వారి ఉరిశిక్షలను యావజ్జీవ కారాగారశిక్షలుగా మార్చేశారు. ఈ శిక్షాకాలం కూడా ఎపుడో ముగిసిపోయింది. ఈ నేపథ్యంలో ఈ కేసులో శిక్ష అనుభవిస్తున్న మొత్తం ఏడుగురు ఖైదీలను విడుదల చేయాలంటూ తమిళనాడు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రస్తుతం తమిళనాడు రాష్ట్ర గవర్నర్‌ భన్వరీలాల్‌ పురోహిత్‌ ముందు పెండింగ్‌లో ఉంది.