కారులో చెలరేగిన మంటలు

– తల్లీ ఇద్దరు కూతుళ్లు సజీవదహనం
– దేశ రాజధానిలో విషాద ఘటన
న్యూఢిల్లీ, మార్చి11(జ‌నంసాక్షి) : దైవ దర్శనానికి వెళుతున్న కుటుంబాన్ని మృత్యువు వెంటాడింది. కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగి.. తల్లి ఇద్దరు కూతుళ్లతో సహా సజీవదహనంకాగా.. మరో ఇద్దరు గాయాలతో బయటపడ్డారు. తూర్పు ఢిల్లీలోని అక్షర్‌ధామ్‌ ఫ్లెఓవర్‌పై ఆదివారం రాత్రి ఈ ప్రమాదం సంభవించింది.
ఢిల్లీకి చెందిన ఉపేంద్ర మిశ్రా, రంజన మిశ్రా దంపతులు తన ముగ్గురు కుమార్తెలతో కలిసి అక్షర్‌ధామ్‌ ఆలయానికి బయల్దేరారు. ఆదివారం రాత్రి కారు.. అక్షరధామ్‌ ప్లే ఓవర్‌పైకి రాగానే ఉన్నట్టుండి మంటలు చెలరేగాయి. క్షణాల్లోనే మంటలు చుట్టుముట్టడంతో.. రంజన మిశ్రా ఇద్దరు కూతుళ్లు సజీవదహనమయ్యారు.
ప్రమాదంలో కారును డ్రైవింగ్‌ చేస్తున్నఉపేంద్ర మిశ్రా.. ముందు సీట్లో కూర్చొన్న మరో కుమార్తెను తీసుకొని బయటకు వెళ్లిపోయాడు. వీరిద్దరికి గాయాలుకాగా.. వెంటనే దగ్గరలోని ఆస్పత్రికి తరలించారు. సీఎన్జీ గ్యాస్‌ లీక్‌ కావడం వల్లే మంటలు చెలరేగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే మిశ్రాతో పాటూ స్థానికులు కారు డోర్లను తెరిచే ప్రయత్నం చేశారు. మంటల దెబ్బకు కారు దగ్గరకు కూడా వెళ్లలేని పరిస్థితి ఎదురయ్యింది. విషయం తెలుసుకున్న ట్రాఫిక్‌ పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకుని ట్రాఫిక్‌ను నియంత్రించి మంటల్ని అదుపు చేశారు. కుటుంబ సభ్యులను కళ్లముందే కోల్పోవడంతో.. మిశ్రా రోదనలు అక్కడున్నవారిని కంటతడి పెట్టించాయి.