కాల్పుల ఘటనపై విచారణ వేగవంతం

కేసు దర్యాప్తులో నలుగురి అనుమానితుల అరెస్ట్‌

నల్లగొండ,ఆగస్ట్‌6( జనం సాక్షి): నల్లగొండ జిల్లా మునుగోడు మండలం సింగారం`ఊకొండి శివారులో గురువారం రాత్రి కలకలం రేపిన కాల్పుల ఘటనపై పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. బాధితుడు లింగస్వామికి నార్కట్‌పల్లి కామినేని వైద్యవిద్య కళాశాల ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. బాధితుడిని, అతడి కుటుంబసభ్యులను నల్లగొండ డీఎస్పీ నర్సింహారెడ్డి విచారించారు. కేసులో నలుగురు అనుమానితులను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నట్లు సమాచారం. వివాహేతర సంబంధమే కాల్పుల ఘటనకు దారి తీసి ఉండవచ్చని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. లింగస్వామి కుటుంబ నేపథ్యం, వ్యాపార లా వాదేవీలు, సంబంధాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. లింగస్వామిని హతమార్చేందుకు పక్కా పథకం ప్రకారమే కాల్పులు జరిపినట్లు ప్రాథమికంగా నిర్దారణకు వచ్చారు. ఓ ప్రభుత్వ
ఉపాధ్యాయుడే ఈ ఘటనకు సూత్రధారి అని ప్ర చారం జరుగుతోంది. రెండు రోజుల్లో కేసును ఛేదిస్తామని అధికారులు ధీమాగా ఉన్నారు. బాధితుడి శరీరం నుంచి రెండు తూటాలను వైద్యులు శస్త్రచికిత్స చేసి తొలగించారు. ప్రస్తుతం అతడి పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు తెలుస్తోంది.