కాశ్మీర్‌లో బీజేపీ, పీడీపీ సంకీర్ణానికి తెర

పీడీపీతో బంధం తెంచుకున్నట్లు ప్రకటించిన బీజేపీ
ముఖ్యమంత్రి మొహబూబా ముఫ్తీ రాజీనామా
గవర్నర్‌ చేతుల్లోకి పాలన
శాంతిభద్రతలు అదుపులోకి తెచ్చేలా కేంద్రం దృష్టి
న్యూఢిల్లీ, జూన్‌19(జ‌నం సాక్షి ) : జమ్ముకశ్మీర్‌లో బీజేపీ, పీడీపీ సంకీర్ణానికి తెరపడింది.. పీడీపీ నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం నుంచి మంగళవారం బీజేపీ బయటకొచ్చేసింది. మంగళవారం ఉదయం బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షాతో జమ్మూకాశ్మీర్‌ కు చెందిన ఆపార్టీ ఎమ్మెల్యేలు భేటీ అయ్యారు. ఈ భేటీ అనంతరం పీడీపీతో తెగదెంపులు చేసుకుంటున్నట్లు బీజేపీ జనరల్‌ సెక్రటరీ,కాశ్మీర్‌ వ్యవహారాల ఇన్‌ఛార్జ్‌ రామ్‌మాధవ్‌ ప్రకటించారు. గత కొంతకాలంగా కాశ్మీర్‌లో హింసాత్మక సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి. పరిస్థితులను అదుపు చేయడంలో ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ విఫలమవుతూ వస్తున్నారనే ఆరోపణలు తీవ్రంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో జర్నలిస్ట్‌ షుజాత్‌ బుఖారీ హత్య ఇటీవల దేశవ్యాప్తంగా కలకలం సృష్టించింది. జర్నలిస్ట్‌ హత్యతో పాటు జవాన్‌ ఔరంగజేబు హత్య, రాళ్లదాడులు దేశవ్యాప్తంగా పీడీఎస్‌, బీజేపీ సంకీర్ణ ప్రభుత్వం తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. దీనికితోడు రంజాన్‌ సందర్భంగా కేంద్ర ప్రభుత్వ ఆదేశాలానుసారం నెల రోజుల పాటు భారత సైన్యం కాల్పుల విరమణను పాటించింది. వేర్పాటువాదులతో చర్చలకు ఇదే మంచి తరుణమని జమ్ము కశ్మీర్‌ సీఎం మెహబూబా ముఫ్తీ.. కేంద్రం నిర్ణయాన్ని ప్రశంసించారు. అయితే సరిగ్గా రంజాన్‌కు రెండు రోజుల ముందు పత్రికా సంపాదకుడు భుకారి హత్య, ఆపై ఆర్మీ రైఫిల్‌ మ్యాన్‌ ఔరంగజేబును ఉగ్రవాదులు దారుణంగా
హతమార్చారు. దీంతో పరిస్థితులు ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారాయి. ఈ తరుణంలో కాల్పుల విరమణను పక్కనబెట్టి, చర్యలకు ఉపక్రమించాలని సైన్యానికి కేంద్ర ¬ంశాఖ ఆదేశాలు జారీ చేసింది. ఇది పీడీపీ వర్గాలకు ఏ మాత్రం రుచించలేదు. కాల్పుల విరమణను మరికొంత కాలం పొడిగించి ఉంటే శాంతిచర్చలు ఓ కొలిక్కి వచ్చి ఉండేవేమోనని ఆమె భావించారు. కానీ, హఠాత్తుగా కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని ముఫ్తీ జీర్ణించుకోలేకపోయారు. ఇప్పటికే చాలా అంశాల్లో పీడీపీ-బీజేపీల మధ్య విభేదాలు ఉండగా, కాల్పుల విరమణపై కేంద్రం తీసుకున్న నిర్ణయంపై మెహబూబా ముఫ్తీ అసంతృప్తితో రగలిపోతున్నారు. ఈ తరుణంలో అమిత్‌ షా నుంచి పిలుపు అందుకున్న కశ్మీర్‌ బీజేపీ ఎమ్మెల్యేలు.. మంగళవారం భేటీ అయ్యారు. ఈ భేటీలో కాశ్మీర్‌లో శాంతిభద్రతలు అదుపుతప్పాయని, ఇంకా పీడీపీ ప్రభుత్వంలో కొనసాగితే దేశవ్యాప్తంగా అప్రతిష్టపాలు కావాల్సి వస్తుందని ఎమ్మెల్యేలంతా అమిత్‌షాతో పేర్కొనట్లు తెలుస్తోంది. దీంతో వెంటనే పీడీపీ నుంచి వైదొలుగుతున్నట్లు బీజేపీ ప్రకటించింది.
ముఖ్యమంత్రి మొహబూబా ముఫ్తీ రాజీనామా..
పీడీపీ ప్రభుత్వం నుంచి బీజేపీ వైదొలుగుతున్నట్లు ప్రకటించిన కొద్దిసేపటికే ముఖ్యమంత్రిగా ఉన్న మొహబూబా ముఫ్తీ రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో రాష్ట్ర పగ్గాలు గవర్నర్‌ చేతుల్లోకి వెళ్లనున్నాయి. బీజేపీ అనుకున్న విధంగా వ్యవహారం నడిచినట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. గవర్నర్‌ పాలన ద్వారా కాశ్మీర్‌లో ఉగ్రమూకలను అరికట్టాలని, తద్వారా రాష్ట్రంలో శాంతిభద్రతలు నెలకొల్పేలా చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది.
శాంతి భద్రతల అదుపులో సీఎం ముఫ్తీ విఫలం ా రాంమాధవ్‌
కశ్మీర్‌లో ఉగ్రవాదం, హింస పెరిగిపోయిందని, పౌరుల ప్రాథమిక హక్కులకు విఘాతం కలిగిందని రాంమాధవ్‌ విమర్శించారు. అమిత్‌షాతో భేటీ అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. జర్నలిస్ట్‌ షుజాత్‌ బుఖారీ హత్యే దీనికి నిదర్శనమని అన్నారు. దేశ సమగ్రత, ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని రాష్ట్రంలో పరిస్థితులను అదుపులోకి తీసుకురావాలన్న ఉద్దేశంతో అధికారాన్ని గవర్నర్‌కు ఇవ్వాలని నిర్ణయించినట్లు రాంమాధవ్‌ స్పష్టంచేశారు. రాష్ట్రంలో మూడేళ్ళ క్రితం పీడీపీ-బీజేపీ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిందన్నారు. రాష్ట్రంలో పరిస్థితులపై కేంద్ర, రాష్టాల్రకు చెందిన వివిధ సంస్థలతో మాట్లాడినట్లు చెప్పారు. పీడీపీతో కలిసి సంకీర్ణ ప్రభుత్వంలో కొనసాగే అవకాశం ఇక విూదట లేదని నిర్ణయానికి వచ్చినట్లు తెలిపారు. పార్టీలోని అందరి సమ్మతితో జమ్మూ-కశ్మీరు ప్రభుత్వం నుంచి వైదొలగాలని బీజేపీ నిర్ణయించినట్లు తెలిపారు. పీడీపీ-బీజేపీ కూటమి ప్రభుత్వం కోసం కనీస ఉమ్మడి కార్యక్రమాన్ని రూపొందించుకున్నామన్నారు. రాష్ట్రంలో శాంతిని పునరుద్ధరించడం, వేగంగా అభివృద్ధి జరిగేలా ప్రోత్సహించడం కోసం తాము పీడీపీతో కలిసి ప్రభుత్వంలో భాగస్వాములమయ్యామన్నారు. అయితే ఇటీవల కశ్మీరు లోయలో ఉగ్రవాదం, హింస పెరిగాయన్నారు. ప్రజల ప్రాథమిక హక్కులు ప్రమాదంలో పడ్డాయన్నారు. శ్రీనగర్‌ పట్టణంలో హత్యలు జరుగుతున్నాయన్నారు. పత్రికా సంపాదకుడిని ఉగ్రవాదులు హత్య చేసిన సంఘటనను గుర్తు చేశారు. కేంద్ర ప్రభుత్వం రూ.80 వేల కోట్ల నిధులతో ప్యాకేజీని రాష్టాన్రికి ఇచ్చిందని, వివిధ అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టిందన్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ స్వయంగా లడఖ్‌, జమ్మూ-కశ్మీరులో పర్యటించినట్లు తెలిపారు. రాష్ట్రంలో పరిస్థితిని చక్కదిద్దేందుకు మధ్యవర్తిని కూడా నియమించామన్నారు. కశ్మీరులోయలో 4,000 బంకర్లను నియమించినట్లు తెలిపారు. /ూష్ట్రంలో పరిస్థితిని నియంత్రించడంలో ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ
విఫలమయ్యారన్నారు. దేశ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని పీడీపీ-బీజేపీ కూటమి నుంచి వైదొలగాలన్న నిర్ణయించినట్లు తెలిపారు.  విలేకర్ల సమావేశంలో జమ్మూ-కశ్మీరు ఉప ముఖ్యమంత్రి కవీంద్ర గుప్తా, కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్‌, జమ్మూ-కశ్మీరు బీజేపీ నేతలు పాల్గొన్నారు.