కాశ్మీర్‌ సమస్యపై కఠిన చర్యలే మేలు

పాక్‌ పన్నాగాలను ఎండగట్టాల్సిందే

న్యూఢిల్లీ,సెప్టెంబర్‌22(జ‌నంసాక్షి ): గత నాలుగున్నరేళ్ళుగా కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్రమోదీ ప్రభుత్వం కాశ్మీర్‌ సమస్య, కాశ్మీర్‌ పట్ల కఠినమైన వైఖరితో వ్యవహరించలేదు. విజ్ఞతాయుతమైన నిర్ణయాలేవీ తీసుకోలేదు. కాశ్మీర్‌ లోయ ప్రజలతో భారత రాజ్యవ్యవస్థ ఒక ఉద్వేగాత్మక అనుబంధంతో వ్యవహరించడంలో విఫలమయింది. అయితే పక్కలో బల్లెంలా ఉన్న పాక్‌ పాలకులు కాశ్మీర్‌లో ఆజ్యం పోస్తూ ఉగ్రవాదులను ఎగదోస్తున్నారు. భారత్‌లో అలజడి సృష్టించేందుకు పాక్‌ చేస్తున్న ప్రయత్నాలు ఈ నాటివి కాదు. భారత్‌ నుంచి విడివడ్డ నాటి నుంచి అంటే 1947 నుంచి కుట్రలు పన్నుతూనే ఉంది. సరిహద్దుల్లో ఉద్రిక్తతలు సృష్టించి తీవ్రవాదులను దేశం దాటించాలని అక్కడి సైన్యం చూస్తోంది. సరిహద్దుల్లో తీవ్రవాదలును చొప్పించేందుకు సిద్దంగా ఉన్న పాక్‌ సైన్యం కాల్పుల ద్వారా తరచూ దృష్టి మరల్చేందుకు ప్రయత్నాలు చేస్తోంది. సరిహద్దులో పాకిస్థాన్‌ పదేపదే కాల్పులకు తెగబడుతున్న తీరు దాని కుత్సిత బుద్దికి నిదర్శనంగా చెప్పుకోవాలి. పాక్‌కు మాటలతో సమాధానం చెప్పలేమని గతానుభవాలను బట్టి తెలుసుకోవాలి. పాక్‌లో అంతర్గ సంక్షోభాలు వచ్చినప్పుడల్లా ఇలా భార్‌తపైకి దాడులకు దిగుతారు. పొరుగు దేశమైన పాకిస్థాన్‌లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరికి అర్ధం కాదు. తాలిబన్లను పెంచి పోషిస్తున్న పాపానికి ఆ దేశం కూడా భారీ మూల్యాన్ని చెల్లించుకుంటూనే ఉంది. ప్రజాస్వామ్యం ముసుగులో సైనిక పాలన సాగడం పాకిస్థాన్‌లోనే కనిపిస్తుంది. ఇవన్నీ కప్పిపుచ్చు కోవడానికి భారత సరిహద్దుల్లో కాల్పులకు తెగబడుతుంటోంది. ఇలాంటి పరిస్థితిని సృష్టించడం అలవాటున్న పాకిస్తాన్‌

ప్రభుత్వం, రాజకీయ పార్టీలు భారత్‌పై వ్యతిరేకతను తమ ప్రజలకు నూరిపోయాలనే చూస్తుంటాయి. పాకిస్తాన్‌ ప్రజలను రెచ్చగొట్టేందుకే కాశ్మీర్‌ విషయంలో ఎప్పుడూ వివాదం సృష్టిస్తూనే ఉంటారు. భారత్‌ నుంచి విడివడి ఏర్పడిన పాకిస్తాన్‌ మనపై దండెత్తి కాశ్మీర్‌లోని కొంత భూభాగాన్ని ఆక్రమించింది. ఆక్రమిత కాశ్మీర్‌ సమస్య రాజుకుంటూనే ఉంది. ఎన్నోమార్లు అవకాశాలు వచ్చినా ఈ సమస్యను పరిష్కరించడంలో నాటి పండిట్‌ నెహ్రనూ, ఇందిరా గాంధీలు విఫలం కావడంతో అదో రావణ కాష్టంలా రాజుకుంటోంది. దౌత్య పరంగా తప్పటడుగుల వేయడంతో భారత్‌కు తిప్పలు తప్పలేదు. ఇప్పటికైనా మోడీ దీని పరిష్కారాన్ని చేతల్లోకి తీసుకోవాలి. లేకుంటా మరింతగా పరిస్థితులు దిగజారగలవు. పాక్‌ ప్రేరేపిత ఉగ్రవాదులు నిరంతరం లోయలో ప్రజలను రెచ్చగొడుతున్నారు. ఆక్రమిత కాశ్మీర్‌,బలూచిస్థాన్‌ విషయంలోమాత్రం పాక్‌ కఠినంగా వ్యవహరిస్తోంది. దానిని ఎండగట్టినప్పుడే సగం విజయం సాదించగలం.

అలాంటి కఠన చర్యలనే మనమూ అవలంబించాలి. కాశ్మీర్‌లో అగ్గి రాజేయడం ద్వారా రాజకీయ లబ్ది పొందాలని పాక్‌ పన్నాగాలు పన్నుతోంది. దీనిని అణచివేయడానికి ఎంతకైనా తెగించాలి. అలాటే ఆర్మీపై దాడులకు దిగే యువతకు కూడా గట్టి సందేశం ఇవ్వాలి. భారత్‌ను దెబ్బ కొట్టాలనుకునేవారికి కశ్మీర్‌ సులభ లక్ష్యంగా మారింది. కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం ఈ విపత్కర పరిణామాలను గ్రహించి, కశ్మీర్‌లో ఆందోళనలను తొందరగా అదుపులోకి తేవాలని గుర్తించాలి. కాశ్మీర్‌ నిరంతరం రగులుతూ ఉండటం భారతదేశానికి ఏ మాత్రం క్షేమకరం కాదు. భౌగోళికంగా ఇరుగుపొరుగు పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నది.