కాసులు కురిపిస్తున్న మినరల్‌ వాటర్‌ 

మంచినీటి వ్యాపారంతో లాభాలు
కామారెడ్డి,ఫిబ్రవరి9(జ‌నంసాక్షి):  నీటి ఎద్దడి ఉన్న  ప్రాంతాల్లో ప్యూరిఫైడ్‌ వాటర్‌ ప్లాంట్‌లు పుట్టగొడుగుల్లా వెలుస్తున్నాయి. ఎలాంటి అనుమతులు లేనప్పటికీ వ్యాపారులు ప్యూరిఫైడ్‌ వాటర్‌ ప్లాంట్‌లు ఏర్పాటు చేసి విచ్చలవిడిగా విక్రయాలు నిర్వహిస్తున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. మంచినీటి ఎద్దడి ఏర్పడడంతో ప్రజలు విధిలేని పరిస్థితుల్లో ప్యూరిఫైడ్‌ వాటర్‌ను కొనుగోలు చేస్తున్నారు. దీన్ని ఆసరాగా చేసుకొని వ్యాపారులు నిబంధనలకు విరుద్దంగా ప్లాంట్లను నిర్వహిస్తూ అధిక రేటుకు విక్రయాలు జరుపుతున్నారు. ఎండాకాలంలో మంచినీటి కొరతలను ఆసరాగా చేసుకుని ఏటా నీటి సరఫరాదారులు క్యాష్‌ చేసు కుంటున్నారు.  వేసవికి ముందే గ్రామాల్లో తీవ్ర నీటి ఎద్దడి నెలకొంది. మినరల్‌ వాటర్‌ పేరుతో గ్రామానికి వచ్చే నీటి వ్యాపారులు అధిక రేట్లకు నీటిని విక్రయాలు జరుపుతున్నారు. అధికారులు స్పందించి వారిపై చర్యలు తీసుకోవాలి. నాణ్యత లేని ప్యూరిఫైడ్‌ వాటర్‌ సరఫరా చేస్తూ లాభాలు గడిస్తున్నారు. దీనికి స్థానిక నేతలు సహకారం అందిస్తున్నారు. దీంతో అధికారులు కూడా చూసీచూడనట్లు ఉంటున్నారు. ఇలా తెలంగాణ జిల్లాల్లో పుట్టగొడుగుల్లా నీటి వ్యాపారం సాగుతోంది. వాటర్‌ప్లాంట్‌ నిర్వాహకులు నిబంధనలు పాటించడంలేదు. అధికారుల తని ఖీలు లేకపోవడంతో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. నీళ్లు తాగడం వల్ల కీళ్ళ నొప్పులు వస్తున్నాయి. తనిఖీలు నిర్వహించి వారిపై చర్య తీసుకోవాల్సిన అధికారులు నిమ్మకు నీరెత్తినట్లుగా ఉంటున్నారన్న విమర్శలు ఉన్నాయి.  క్యాన్‌కు రూ. 10 నుండి 15 వరకు విక్రయాలు జరుపుతున్నారు. ప్లాంట్‌ ఏర్పాటు చేయాలంటే ప్రభుత్వ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి. కాని వ్యాపారులు నిబంధనలు పాటించకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరి స్తున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఇలా మారుమూల  గ్రామాలకు కూడా క్యాన్లలో నీటిని తరలిస్తున్నారు. అధికారులు స్పందించి నిబంధనలకు విరుద్దంగా వ్యవహరిస్తున్న ప్యూరిఫైడ్‌ వాటర్‌ నిర్వాహకులపై చర్యలు చేపట్టి నాణ్యమైన నీరుఅందేలా చూడాలని ప్రజలు కోరుతున్నారు.