కూటమినేతలను నమ్మవద్దు: మాజీ ఎమ్మెల్యే

సిద్దిపేట,అక్టోబర్‌10(జ‌నంసాక్షి): ఎన్నికల్లో మహాకూటమి అభ్యర్థులకు గట్టి గుణపాఠం చెప్పాలని దుబ్బాక మాజీ ఎమ్మెల్యే రామలింగారెడ్డి ప్రజలను కోరారు. తెలంగాణ ప్రజలు ఈ కూటమి నేతలకు తగిన గుణపాఠం చెబుతారని అన్నారు.  అది మహాకూటమి కాదని ఓ మాయాకూటమి అని  విమర్శించారు. తెలంగాణ ప్రగతిని అడ్డుకునే కూటమి నేతలను దగ్గరకు రానీయవద్దని ఆయన తన ప్రచారంలో చెబుతున్నారు.ఏజెండా లేని మోసగాళ్ల మాటలు ప్రజలు నమ్మె స్థితిలో లేరన్నారు. ముఖ్యంగా సీఎం కేసీఆర్‌ పాలన కారణంగా ఈ ప్రాంతం ఎంతో అభివృద్ది చెందిందని, నియోజకవర్గంలో గతంలో ఎవరూ చేపట్టని విధంగా జరిగిన అభివృద్ధి పనులను చూసిన ప్రజలు ఆనందంగా ఉన్నారని అన్నారు. రాబోయే ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలుపొందడం ఖాయమన్నారు. కొందరు నాయకులు నియోజకవర్గంలో అభివృద్ధి పనులు ఏవిూ చేయలేదని విమర్శిస్తున్నారని, వారికి తాను చేసిన అభివృద్ధి పనులు కనిపించటం లేదన్నారు. ప్రతిపక్ష పార్టీల అభ్యర్థులకు అసలు ప్రజాసేవ అనేదానికి అర్థం తెలియదని, వారికి తెలిసింది వారి వ్యాపారాలు, సొంత అభివృద్ధి మాత్రమేనని ఎద్దేవా చేశారు.