కూన వెంకటేశ్‌ గౌడ్‌పై తలసాని విజయం

హైదరాబాద్‌: ఎన్నికల ఫలితాల్లో తెరాస జోరు కొనసాగుతోంది. హైదరాబాద్‌ సనత్‌నగర్‌లో తెరాస అభ్యర్థి, మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ విజయం సాధించారు. సమీప ప్రత్యర్థి, తెదేపాకు చెందిన ప్రజాకూటమి అభ్యర్థి కూన వెంకటేశ్‌ గౌడ్‌పై తలసాని విజయం సాధించారు. గత ఎన్నికల్లో తెదేపా అభ్యర్థిగా పోటీ చేసిన తలసాని కాంగ్రెస్‌ అభ్యర్థి మర్రి శశిధర్‌రెడ్డిపై విజయం సాధించారు. అనంతరం జరిగిన రాజకీయ పరిణామాల్లో అధికార తెరాసలో చేరి మంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టారు. సనత్‌నగర్‌లో తెరాసకు క్యాడర్‌ బలం లేకపోవడంతో కొత్తగా క్యాడర్‌ను తయారు చేసుకోవడంతోపాటు నాలుగున్నరేళ్లలో అభివృద్ధి పనులపై దృష్టి సారించారు.

కూటమి పొత్తుల్లో భాగంగా చివరలో తెదేపాకు సనత్‌నగర్‌ స్థానాన్ని కేటాయించారు. తెదేపా తరఫున స్థానికుడైన కూన వెంకటేశ్‌గౌడ్‌ ఇక్కడినుంచి బరిలో నిలిచారు. 2009లో ఈ స్థానం నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థి మర్రి శశిధర్‌రెడ్డి విజయం సాధించారు. 2014లో ఇక్కడి నుంచి మరోసారి ఆయన పోటీచేసి ఓడిపోయారు. ఈ ఎన్నికల్లోనూ పోటీ చేయాలని విశ్వప్రయత్నాలు చేసినా మర్రికి నిరాశే ఎదురైంది.