కూలిన అల్జీరియా సైనిక విమానం

అల్జీర్స్‌: సైనికులను తరలిస్తున్న ఆర్మీ విమానం ఒక్కసారిగా కుప్పకూలడంతో సుమారు 200 మంది దుర్మరణం చెందారు. ఉత్తర ఆఫ్రికా దేశం అల్జీరియాలో బుధవారం ఈ సంఘటన జరింది. దేశరాజధాని అల్జీర్స్‌ శివారులోగల బొఫరిక్‌ ఎయిర్‌పోర్టులో విమానం ల్యాండ్‌ కావాల్సి ఉండగా.. ప్రమాదవశాత్తూ కుప్పకూలిపోయింది. ఎయిర్‌పోర్టు పక్కనేఉన్న జనావాసాలపై విమానం కూలిపోవడంతో మృతుల సంఖ్య భారీగా పెరిగింది.

స్థానిక మీడియా కథనాల మేరకు.. బొఫరిక్‌ ఎయిర్‌పోర్టు ప్రస్తుతం ఆర్మీ ఆధీనంలో ఉంది. అవసరాల నిమిత్తం వివిధ ప్రాంతాలకు సైన్యాన్ని తరలించే కార్యక్రమం ఇక్కడి నుంచే జరుగుతూఉంటుంది. ఆ క్రమంలో బుధవారం 100 మంది సైనికులతో ప్రయాణిస్తున్న విమానం.. ఎయిర్‌పోర్టుకు సమీపంగా కూలిపోయింది. ఈ ఘటనలో సైనికులు, విమాన సిబ్బంది అందరూ చనిపోయి ఉంటారని అనుమానిస్తున్నారు. విమానం కూలిన ఇళ్లలోని ప్రజలను కలుపుకుంటే మృతుల సంఖ్య 200 వరకు ఉండొచ్చని భావిస్తున్నారు. ఈ వార్తకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సిఉంది.