కెటిఆర్‌ మంత్రిగా అనర్హుడు

అమిత్‌ షాపై అనుచిత విమర్శలు: బిజెపి
కరీంనగర్‌,అక్టోబర్‌13(జ‌నంసాక్షి): కరీంనగర్‌లో అమిత్‌షా సభ విజయవంతంతో అధికార టిఆర్‌ఎస్‌లో వణుకు పుడుతోందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు కొత్త శ్రీనివాస్‌ రెడ్డి అన్నారు. మంత్రి కెటిఆర్‌ స్థాయిని మరచి జాతీయ నాయకుడిపై విమర్వలు చేయడం చూస్తుంటే ఎన్నికల్లో బిజెపి పట్ల వారికి భయం పట్టుకుందని
అర్థం అవుతోందన్నారు. అమిత్‌షా రాష్ట్రానికి 2లక్షల 13వేల కోట్ల రూపాయలు ఇచ్చామని చెబితే ఒకవేళ తప్పయితే దాన్ని ఖండించాలే తప్ప ఇంట్లోకెళ్లి ఇచ్చారా అని కేటీఆర్‌ ప్రశ్నించడం సిగ్గుచేటని అన్నారు.
కేటీఆర్‌కు మంత్రిగా ఉండే అర్హతే లేదని ఆయన అన్నారు. రాష్ట్రంలో అందిస్తున్న పింఛన్లు, కల్యాణలక్ష్మి చెక్కులు, ఇతర డబ్బులు విూ గడీగోడలు అమ్మి ఇస్తున్నారా, విూ ఇంట్లోనుంచి ఇస్తున్నారా అని ఆయన ప్రశ్నించారు. నరేంద్ర మోదీ ముఖ్యమంత్రిగా గుజరాత్‌లో అదించిన పాలనను చూసి ఆయనను దేశ ప్రజలు ప్రధానిగా గెలిపించారని గుర్తు చేశారు. బీజేపీని మతోన్మాద పార్టీ అని అంటున్న టీఆర్‌ఎస్‌ మతోన్మాద పార్టీ అయిన ఎంఐఎంతో అంటకాగుతున్నదని, బీజేపీని విమర్శించే అర్హత టీఆర్‌ఎస్‌కు లేదని  అన్నారు. రజాకార్ల నాయకుడు కాసీంరజ్వీ స్థాపించిన ఎంఐఎం పార్టీతో టీఆర్‌ఎస్‌ అంటకాగుతున్నదని ఆయన విమర్శించారు. బీజేపీ ఒకవేళ మతోన్మాదాన్ని రెచ్చగొడితే టీఆర్‌ఎస్‌ నేతలు ఎక్కడా అడుగు పెట్టలేరని ఆయన సవాల్‌ విసిరారు.  కేసీఆర్‌ కుటుంబ పాలనకు ప్రజలు గుణపాఠం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని  అన్నారు.  కరీంనగర్‌లో జరిగిన అమిత్‌షా సభకు ప్రజలు స్వచ్ఛందంగా పెద్ద సంఖ్యలో తరలివస్తే దానిని అట్టర్‌ ఫ్లాప్‌ సభగా కేటీఆర్‌ అభివర్ణించడాన్ని తప్పుపట్టారు. టీఆర్‌ఎస్‌ సభలాగా తాము మందుబాటిళ్లు బిర్యానీలు సరఫరా చేయలేదని,  విందులు చేయలేదని ఆయన అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో ఎస్సారెస్పీకి పునర్జీవం కలిగిస్తామని చెప్పి అది చేయకుండానే ఎస్సారెస్పీలోని నీటిని మిడ్‌ మానేరుకు
తరలిస్తున్నారని, ఎస్సా రెస్పీ ఆయకట్టుకు నీరు అవసరం లేదా అని ఆయన ప్రశ్నించారు. జిల్లాలో బిజెపి సత్తా చాటుతుందని అన్నారు.