కెసిఆర్ను కలసి సమస్యలు వివరించే దమ్ముందా?
టిఆర్ఎస్ నేతలకు శ్రీధర్ బాబు సవాల్
కెసిఆర్ ఫామ్హౌజ్కే పరిమితం కాక తప్పదు
ప్రజారంలో జోరు పెంచిన మాజీమంత్రి
మంధని,డిసెంబర్3(జనంసాక్షి): అధికార పార్టీలో ఉన్న మంత్రులకు, ఎమ్మెల్యేలకు సిఎం కెసిఆర్ను కలిసి సమస్యలు వివరించే దమ్ముందా అని మాజీమంత్రి, కాంగ్రెస్ అభ్యర్థి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. కెసిఆర్ను కలవలేని వారు ప్రజా సమస్యలను ఏ రకంగా పరిష్కరిస్తారని అన్నారు. గత నాలుగేళ్లలో జరిగిన నష్టాన్ని ఇకముందు కూడా జరక్కూడదంటే కూటమికి ఓటేయాలని శ్రీధర్ బాబు పిలుపినిచ్చారు. వివిధ గ్రామాల్లో జరిగిన ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. తెరాస అధినేత కేసీఆర్ ఎన్నికల్లో ఓడిపోయి ఫాంహౌజ్కు పరిమితం కావడం ఖాయమని అన్నారు. ప్రజాఫ్రంట్ గెలిచి అధికారం చేపట్టి తీరుతుందని తెలిపారు. ఓటమి భయంతోనే బహిరంగ సభలో ప్రజలు హావిూల గురించి అడుగుతుంటే కోపంగా సమాధానమిస్తున్నారని పేర్కొన్నారు. జిల్లాలో తనతో పాటు మెజార్టీ ప్రజాఫ్రంట్ అభ్యర్థులు విజయం
సాధిస్తారన్నారు.విద్య, వైద్యం, సంక్షేమం, వ్యవసాయం, ఉపాధి రంగాలకు ప్రాధాన్యత ఇస్తానని అన్నారు. నిరుద్యోగ యువతకు ఉద్యోగాల కల్పకు దృష్టి కేంద్రీకరిస్తామన్నారు. ప్రజాకూటమి అధికారంలోకి వస్తే నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులు ఆగుతాయనే దుష్పచ్రారం చేయడంతో ఓట్లు పొందాలని చూస్తున్నారని మండిపడ్డారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రాజెక్టుల రీ డిజైనింగ్లో అవినీతిపై విచారణ చేయిస్తామని అన్నారు. అలాగే ప్రాధాన్యత క్రమంలో నిర్మాణం పూర్తితోపాటు మేనిఫెస్టోలోని హావిూలను అమలు చేస్తుందని వివరించారు. తెరాస ప్రజలకిచ్చిన హావిూలను నెరవేర్చకుండా నియంతృత్వ పాలన సాగించిందన్నారు. రూ.2లక్షల కోట్లు అప్పులు చేసి వాటిని తీర్చే సమయం రావడంతోనే కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్లాడన్నారు.ఆరోగ్యశ్రీకి కూడా డబ్బులు కట్టలేకుండా చతికిల పడ్డారని అన్నారు. సోనియాగాంధీని ఒప్పించి ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుకు కృషి చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీదన్నారు. ఆమెను అమ్మాబొమ్మా అంటూ విమర్వించడం కెసిఆర్కే చెల్లిందన్నారు. రాష్ట్రం ఏర్పాటు కోసం పాటుపడిన కాంగ్రెస్ కూటమి అధికరాంలోకి వస్తేనే తెలంగాణకు న్యాయం జరగగలదని అన్నారు. తెలంగాణలో మహాకూటమి అధికారంలోకి రాగానే రైతులకు తక్షణమే రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేయనున్నట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా గడప గడపకు వెళ్లి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని అభ్యర్థించారు. నిధులు, నీళ్లు, నియామాకాల కోసం సాధించుకున్న ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో నాలుగున్నర సంవత్సరాలుగా కుటుంబపాలనకే పరిమితమైందన్నారు. గత ఎన్నికల్లో ఓడిపోయినా నాలుగున్నర సంవత్సరాలుగా నియోజకవర్గంలో ప్రజలకు అందుబాటులో ఉండి రైతులు, ప్రజల సమస్యలపై పోరాడిన వ్యక్తినన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన ఏ ఒక్క హావిూని కేసీఆర్ ప్రభుత్వం అమలు చేయలేదన్నారు. కాంగ్రెస్ హయాంలో మొదలైన ప్రాజక్టులకు రిడిజైన్ పేరుతో అంచనా వ్యయంతో పెంచి వేల కోట్లు దండుకున్నారని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే రైతులకు రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేయడంతో పాటు, ఒక ఇంట్లో ఎందరు అర్హులుంటే వారందరికీ పింఛన్ మంజూరు చేస్తోందని తెలిపారు. అంతేగాక పింఛను పెంచుతామన్నారు. ఇందిరమ్మ ఇండ్లు ఉన్న వారికి అదనంగా రెండు లక్షలు, ఇంటి కోసం దరఖాస్తు చేసుకున్న వారికి 50వేల నగదును, ఇంటి స్థలం ఉండి ఇల్లు కట్టుకునే వారికి ఐదు లక్షల రూపాయలు ప్రభుత్వం అందజేస్తోందన్నారు.