కెసిఆర్‌ నమ్మకాన్ని నిలబెట్టండి

పంటపెట్టుబడితో సస్యవిప్లవం తేవాలి
సమస్యలుంటే సంప్రదించాలి: మంత్రి జోగు
ఆదిలాబాద్‌,మే16(జ‌నం సాక్షి): రైతులు ఎలాంటి ఇబ్బందులు ఉన్నా నేరుగా తన దృష్టికి తీసుకురావాలని రాష్ట్ర అటవీ పర్యావరణ శాఖ మంత్రి జోగు రామన్న సూచించారు. సీఎం కేసీఆర్‌ చేపట్టిన ఈ మ¬న్నత కార్యక్రమాన్ని రైతుకు స్వర్ణయుగంగా అభివర్ణిస్తూ ప్రతీఒక్కరూ సాగు సహాయాన్ని సద్వినియోగం చేసుకొని వ్యవసాయాన్ని సుసంపన్నం చేయాలని అన్నారు. తద్వారా అధిక ఉత్పత్తులు సాధించి తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే వ్యవసాయ రంగంలో నంబర్‌వన్‌గా నిలబెట్టాల్సిన బాధ్యత ప్రతీ ఒక్కరిపై ఉందన్నారు. మరోవైపు జిల్లాలో రైతుబంధు చెక్కులు, పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ జోరుగా సాగుతోంది. ఈ కార్యక్రమం సందర్భంగా గ్రామాల్లో పండుగ వాతావరణం నెలకుంది. జిల్లా వ్యాప్తంగా  వివిధ గ్రామాల్లో మంత్రులు ఎంపీ, ఎమ్మెల్యేలు, అధికారులు, ప్రజాప్రతినిధులు రైతులకు చెక్కులు, పట్టాదారు పాసు పుస్తకాలను పంపిణీ చేస్తున్నారు. జిల్లాలో చెక్కుల పంపిణీ కార్యక్రమం వారం రోజులుగా కొనసాగుతుండగా నగదును తీసుకునేందుకు వివిధ గ్రామాల ప్రజలు నగదును తీసుకునేందుకు బ్యాంకులకు వస్తున్నారు. డబ్బులు పంపిణీలో రైతులకు ఇబ్బందులు లేకుండా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. టెంట్‌లు వేసి నీడను కల్పించడంతో పాటు బ్యాంకుల్లో కౌంటర్‌లు ఏర్పాటు చేసి నగదును పంపిణీ చేస్తున్నారు. మహిళలకు, పురుషులకు వేర్వురుగా క్యూలైన్‌ను ఏర్పాటు చేసి నగదును పంపిణీ
చేస్తున్నారు. నగదు తీసుకున్న రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.ఇదిలావుంటే రైతులకు వచ్చే నెల నుంచి రూ.5 లక్షల బీమా సౌకర్యాన్ని కల్పించనున్నట్లుమంత్రి జోగు రామన్న అన్నారు. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలను అమలు చేస్తుందని చెక్కుల పంపిణీ ద్వారా రైతులకు పెట్టుబడి సాయం అందుతుందని తెలిపారు. వానాకాలం సీజన్‌కు ముందుగానే రైతులు వారికి ఇష్టమైన విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేసే అవకాశం లభిస్తుందని, వ్యాపారులు మాటలు నమ్మకుండా మేలు రకమైన విత్తనాలను తీసుకోవాలని సూచించారు. రైతులు ప్రభుత్వం అందజేస్తున్న పెట్టుబడి డబ్బులను సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా ప్రయోజనం పొందాలని సూచించారు. రైతులు ఇష్టానుసారంగా ఎరువులను వాడి డబ్బులు వృథా చేసుకోవద్దని వ్యవసాయ క్లస్టర్‌ పరిధిలో భూసార పరీక్షలు నిర్వహించుకుని వాటి ఆధారంగా ఎరువులను పంటలకు వినియోగించాలని కోరారు. గ్రామాల్లో చెక్కులు, పాసు పుస్తకాలను తీసుకునేందుకు వచ్చిన రైతులకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. టెంట్‌లు వేసి నీడ, తాగునీటి వసతితో పాటు వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తున్నారు. స్వచ్ఛంద సంస్థలు సైతం రైతులకు మజ్జిగను పంపిణీ చేస్తున్నాయి.
—–