కెసిఆర్‌ ప్రచారంతో పెరిగిన భరోసా

కవిత ప్రచారంతో మారుతున్న పరిస్థితి
జోరు పెంచిన టిఆర్‌ఎస్‌ అభ్యర్థులు
నిజామాబాద్‌,డిసెంబర్‌1(జ‌నంసాక్షి): ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం కేసీఆర్‌ జిల్లాలో వరుసగా నిర్వహించిన ప్రజాశీర్వాద సభలతో టిఆర్‌ఎస్‌ శ్రేణుల్లో జోష్‌ నిండింది. కేసీఆర్‌ తనయ కవిత నిజామాబాద్‌ ఎంపీగా జిల్లా ప్రచారంలో దూసుకుని పోతున్నారు. పలు సభల్లో కవిత పాల్గొన్నారు. వివిధ నియోజకవర్గాల్లో నేరుగా ప్రచారం చేపట్టారు. ప్రచారంలో ఇప్పుడు వారు దూసుకుని పోతున్నారు. ఇప్పటికే నిజామాబాద్‌ ఉమ్మడి జిల్లాకు సంబంధించి పలు  నియోజకవర్గాల వారీగా ప్రచారం నిర్వహించారు. ప్రచారంలో కెసిఆర్‌  కీలక అంశాలను ప్రస్తావించి, హావిూలను కురిపించి జిల్లా ప్రజలను, పార్టీ శ్రేణులను ఉత్తేజపర్చారు. కేసీఆర్‌కు ఇందూరు జిల్లా పై ఆది నుంచి ప్రత్యేక అభిమానం ఉందని చాటారు. తెలంగాణ ఉద్యమ సమయం నుంచి ఇప్పటివరకు సబ్బండవర్ణాలు ఆయన వెన్నంటి ఉన్నాయి. ఉమ్మడి జిల్లాలో అన్ని స్థానాలు కైవసం చేసుకున్నారు. బీడీ కార్మికులకు వెయ్యి రూపాయల జీవనభృతి ఇస్తానని ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ సారి ఇదే కేంద్రంగా బీడీ కార్మికులతో పాటు టేకేదార్లకు కూడా ఆసరా పింఛన్‌ వర్తింపజేస్తామని కేసీఆర్‌ ప్రకటించడం విశేషం.అంతేకాకుండా పసుపు రైతులకు, మహిళ సంఘాలు, ఐకేపీ ఉద్యోగులకు బాసటగా నిలిచేలా మంచి పసుపును ఇక్కడే తయారు చేయించి రేషన్‌షాపుల ద్వారా అందించే అంశాన్ని కూడా ప్రకటించారు. దీంతో రాష్ట్రంలో 4 లక్షల 70 వేల మంది బీడీ కార్మికులకు పింఛన్లు అందుతోంది. తాజాగా టేకేదార్లకు పింఛన్లు ఇచ్చుకుంటామని కేసీఆర్‌ హావిూ ఇచ్చారు. పుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లను నెలకొల్పడం ద్వారా పసుపు రైతుకు లభాలు వచ్చేలా చేస్తామని
కేసీఆర్‌ జిల్లాలో జరిగిన సభల్లో హావిూ ఇచ్చారు. బాల్కొండ, ఆర్మూర్‌ ప్రాంతాల్లో పసుపు అధికంగా సాగు చేస్తారు. ఇక్కడ పండే నాణ్యమైన పసుపు విదేశాలకు వెళ్తుంటే… మనకు మాత్రం మార్కెట్లో కల్తీ పసుపు, రంపపు పొడి కలిపిన పసుపు దొరుకుతుండడం మనం చూస్తున్నదేనన్నారు. పసుపును ప్రాసెసింగ్‌ చేయడం మహిళా స్వయం సహాయక సంఘాలకు ఆదాయం పెంచడంతో బాటు పసుపు రైతుకు గిట్టుబాటు ధర వచ్చేలా చేస్తామని చెప్పారు. శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు, వరద కాలువ, కాకతీయ కాలువ, చెరువులు రివర్స్‌ పంపింగ్‌తో మూడు కాలాల పాటు నీళ్లు ఉండే రోజులు కేవలం 6 నెలల్లోపే రానున్నాయి. దీంతో మత్స్య సంపద బాగా పెరుగనుంది. మొత్తంగా సిఎం పర్యటన, తరవాత ఎంపి కవిత జోరుగా ప్రచారం కలసి వస్తోందని టిఆర్‌ఎస్‌ అభ్యర్తులు జోష్‌ విూదున్నారు.