కేంద్రంలో మార్పునకు ఇదే అవకాశం

మోడీ నిరంకుశాన్ని నిలువరిద్దాం
కాంగ్రెస్‌ ఎంపి అభ్యర్థి దొమ్మాటి సాంబయ్య
వరంగల్‌,మార్చి28(జ‌నంసాక్షి): దేశ రాజకీయాల్లో మార్పునకు అవకాశం వచ్చిందని, మోడీ నిరంకుశానికి, కెసిఆర్‌ వైఖరికి చెక్‌ పెట్టే అవకాశాన్ని ప్రజలు ఉపయోగించుకోవాలని వరంగల్‌ పార్లమెంటు సభ్యుడిగా పోటీ చేస్తున్న కాంగ్రెస్‌ నేత దొమ్మటి సాంబయ్య కోరారు. ఈ ఎన్నికల్లో  రాహుల్‌గాంధీని ప్రధాని చేయడానికి వచ్చిన అవకాశాన్ని ప్రజలు వినియోగించుకోవాలన్నారు. నోట్ల రద్దు, జిఎస్టీతో మోడీ ప్రజలను బజారున పడేశారని, చిన్న వ్యాపారులను దెబ్బతీసారాని అన్నారు. 2014 సార్వత్రిక ఎన్నికల్లో 15 మంది తెరాస ఎంపీలు గెలిచారని, ఈ ఐదేళ్లలో తెలంగాణ రాష్ట్రానికి వారేం చేశారో ప్రజలకు వివరించాలని డిమాండ్‌ చేశారు. వరంగల్‌ ఉమ్మడి జిల్లా నుంచి ఇద్దరు ఎంపీలు గెలిచినా ఒక్క రోజైనా కాజీపేట కోచ్‌ ఫ్యాక్టరీ, బయ్యారం స్టీల్‌ప్లాంట్‌, ప్రాణహిత చెవేళ్ల ప్రాజెక్టుకు జాతీయ ¬దా గురించి ఎందుకు పోరాడ లేదన్నారు.  కాంగ్రెస్‌ నేతలతో కలసి ఆయన పలుఉవురుని కలసి కాంగ్రెస్‌కు ఓటేయాలని అభ్యర్థించారు. ఇదిలావుంటే గెలిచిన కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలను చేర్చుకుంటూ టిఆర్‌ఎస్‌ ప్రాజస్వామ్యాన్ని అపహాస్యం చేస్తోందని  విమర్శించారు. టిఆర్‌ఎస్‌ చేస్తున్న అభివృద్ది ఇదొక్కటే అన్నారు. ఇతర పార్టీల్లో ఉన్న ఎమ్మెల్యేలను చేర్చుకుంటే ప్రజల పక్షాలన మాట్లాడే గొంతుక ఏదన్నారు. కాంగ్రెస్‌ కార్యకర్తల సమావేశంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. ఓటర్లను ప్రత్యక్ష్యంగా కలిసి ఓట్లు అభ్యర్థించాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో అధికార పార్టీ అక్రమాలకు పాల్పడే అవకాశాలు ఉన్నాయని, కార్యకర్తలు అప్రమత్తంగా ఉంటూ వాటిని తిప్పి కొట్టాలని పిలుపునిచ్చారు. గత ఎన్నికల్లో గెలిచిన ఇద్దరు తెరాస ఎంపీలు వరంగల్‌ జిల్లాకు చేసిందేమిటో వివరించాలని డిమాండ్‌ చేశారు. కేంద్రంలో కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే దేశంలోని 25 కోట్ల మంది పేదలకు ఏటా రూ.72 వేల చొప్పున నగదును జమ చేస్తుందని, రూ.2 లక్షల వరకు రుణమాఫీని ఏకకాలంలో అమలు చేస్తుందన్నారు. ఈ విషయాన్ని ఇంటింటా వెళ్లి ఓటర్లకు వివరించాలని కోరారు.