కేంద్రంలో వచ్చేది సంకీర్ణ ప్రభుత్వమే
– ప్రభుత్వ ఏర్పాటులో టీఆర్ఎస్ కీలక భూమిక పోషిస్తుంది
– పరిషత్ ఎన్నికల్లో గులాబీ జెంగా ఎగురవేద్దాం
– టీఆర్ఎస్ ఎంపీ వినోద్ కుమార్
కరీంనగర్, ఏప్రిల్22(జనంసాక్షి) : కేంద్రంలో వచ్చేది సంకీర్ణ ప్రభుత్వమేనని, ప్రభుత్వ ఏర్పాటులో టీఆర్ఎస్ కీలక భూమిక పోషిస్తుందని టీఆర్ఎస్ ఎంపీ వినోద్ కుమార్ అన్నారు. సోమవారం ఆయన కరీంనగర్లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు.. పార్లమెంట్లో బీజేపీ, కాంగ్రెసేతర పార్టీల ప్రాబల్యం ఎక్కువగా ఉంటుంది అని వినోద్ తెలిపారు. చాలా రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలు.. కాంగ్రెస్, బీజేపీతో పొత్తు లేకుండా పోటీ చేస్తున్నాయని అన్నారు. భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదని, ఉనికి కోసమే కాంగ్రెస్ ఎన్నికల్లో పోటీ చేస్తోందని అన్నారు. కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడబోతుందని, సంకీర్ణ
ప్రభుత్వంలో టీఆర్ఎస్ కీలకపాత్ర పోషించనుందని పేర్కొన్నారు. కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం వస్తేనే తెలంగాణకు ప్రయోజనం ఉంటుందన్నారు. గల్లీ నుంచి ఢిల్లీ వరకు టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు ఉండాలని వినోద్ అన్నారు. త్వరలో జరగబయే పరిషత్ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థులు భారీ మెజార్టీతో గెలవాల్సిన అవసరం ఉంది అని వినోద్ కుమార్ పేర్కొన్నారు. పరిషత్ ఎన్నికల్లో కరీంనగర్ ఉమ్మడిజిల్లాలో అన్ని జడ్పీటీసీలతో పాటు జడ్పీస్థానాలు, ఎంపీపీ స్థానాలు కైవసం చేసుకోవాలని తెలిపారు.