కేంద్ర ఉద్యోగులకు బోనస్‌

న్యూఢిల్లీ,అక్టోబరు 21(జనంసాక్షి): దసరా పండుగ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఇవాళ బోనస్‌ ప్రకటించింది. కేంద్ర క్యాబినెట్‌ తీసుకున్న నిర్ణయాలను కేంద్ర మంత్రి ప్రకాశ్‌ జవదేకర్‌ విూడియాతో వెల్లడించారు. 2019-2020 సంవత్సరానికి ప్రొడక్టివిటీ, నాన్‌-ప్రొడక్టివిటీ రూపంలో బోనస్‌ ఇచ్చేందుకు కేంద్ర క్యాబినెట్‌ ఆమోదం తెలిపినట్లు మంత్రి చెప్పారు. బోనస్‌ ప్రకటన వల్ల సుమారు 30 లక్షల నాన్‌-గెజిటెడ్‌ ఉద్యోగులు లబ్ది పొందే అవకాశం ఉన్నట్లు మంత్రి వెల్లడించారు. దీని వల్ల ప్రభుత్వ ఖజానాపై సుమారు 3737 కోట్ల భారం పడనున్నట్లు ఆయన తెలిపారు. బోనస్‌ను సింగిల్‌ ఇన్‌స్టాల్మెంట్‌ పద్ధతిలో ఇవ్వనున్నారు. విజయదశమిలోగా నేరుగా ఆ మొత్తాన్ని బదిలీ చేయనున్నట్లు మంత్రి తెలిపారు. మంత్రి మండలి సమావేశంలో తీసుకున్న ఇతర నిర్ణయాల గురించి కూడా జవదేకర్‌ ప్రకటన చేశారు. జమ్మూకశ్మీర్‌ పంచాయతీ రాజ్‌ చట్టాన్ని ఆమోదించినట్లు చెప్పారు. ఈ చట్టం వల్ల ఇతర రాష్టాల్ర తరహాలో కశ్మీర్‌లోనూ ప్రజాస్వామ్యం వర్థిల్లుతుందన్నారు. రైల్వే, పోస్టల్‌, ఈపీఎఫ్‌వో లాంటి కేంద్ర ప్రభుత్వ సంస్థ ఉద్యోగులకు వారంలోగా బోనస్‌ అందిచనున్నారు.