కేంద్ర పథకాలపైనా..  తెదేపా స్టిక్కర్‌లు వేస్తున్నారు

– బాబు తీరునచ్చకే ఎంపీలు, ఎమ్మెల్యేలు ఆ పార్టీని వీడుతున్నారు
– రైతులను కూడా పార్టీల ఆధారంగా చీల్చారు
– చంద్రబాబు ఓడిపోయి ఇంట్లో కూర్చోవటం ఖాయం
– బీజేపీ ఎంపీ జీవీఎల్‌ నర్సింహారావు
విజయవాడ, ఫిబ్రవరి22(ఆర్‌ఎన్‌ఎ) : కేంద్ర పథకాలపైనా తెదేపా తమ స్టిక్కర్‌లు వేసుకొని ప్రచారం చేసుకుంటుందని, ఫలితంగా చంద్రబాబు స్టిక్కర్‌ బాబుగా మారిపోతున్నారని బీజేపీ ఎంపీ జీవీఎల్‌ నర్సింహారావు అన్నారు. శుక్రవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.. చంద్రబాబు సినీ ఫక్కీలో రాజకీయాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఎన్టీఆర్‌ పేరుతో తీసిన సినిమాలను ప్రజలు వ్యతిరేకించారని చెప్పారని, ఎన్టీఆర్‌ బయోపిక్‌లో వాస్తవాలు చూపించలేదని విమర్శించారు. ఇక కేంద్ర పథకాలపై టీడీపీ స్కిక్టర్‌ వేసుకుంటున్నారని ఆరోపించారు. రైతులను కూడా పార్టీల ఆధారంగా చీల్చారని వ్యాఖ్యానించారు. టీడీపీకి చెందిన రైతులకు మాత్రమే లబ్దిచేకూరుస్తున్నారని తెలిపారు. పోలవరానికి రూ.6,700 కోట్లు ఇస్తే ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని అనడం దారుణమన్నారు. చంద్రబాబు ఓడిపోయి ఇంట్లో కూర్చోవడం ఖాయమని జీవీఎల్‌ జోస్యం చెప్పారు. కేంద్ర పథకాలను తనవిగా ప్రచారం చేసుకుంటున్న చంద్రబాబు నాయుడు ‘స్టిక్కర్‌ బాబు’ అయ్యారని ఎద్దేవా చేశారు. వచ్చేనెలలో కేంద్ర ప్రభుత్వం రైతుల ఖాతాల్లో రూ.2వేలు జమ చేస్తుందని తెలిసి చంద్రబాబు ‘అన్నదాత సుఖీభవ’ అనే స్టిక్కర్‌ కార్యక్రమాన్ని ప్రజల ముందుకు తెచ్చారని ధ్వజమెత్తారు. వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోలుకు గాను కేంద్ర ప్రభుత్వం రాష్టాన్రికి మంజూరు చేసిన నిధులు ఏమయ్యాయో లెక్క చెప్పాలని జీవీఎల్‌ డిమాండ్‌ చేశారు. తాను అన్ని చేశానంటూ గొప్పులు చెప్పుకోవటం చంద్రబాబుకు అలవాటేనన్నారు. రాజమండ్రిలో అమిత్‌ షా వాస్తవాలు చెప్తుంటే.. అవి టీడీపీ నాయకులకు మింగుడుపటడం లేదని జీవీఎల్‌ విమర్శించారు. అమరావతి పేరుతో అవినీతి కట్టడాలు నిర్మిస్తున్నారని ఆరోపించారు. ఎన్టీఆర్‌ సినిమాలో కూడా అన్ని అవాస్తవాలే చూపించారని.. అందుకే ప్రజలు ఆ సినిమాను వ్యతిరేకించారని అన్నారు. కుమార్తెను చూడటం కోసం జగన్‌ లండన్‌కు వెళ్లారని, అయితే చంద్రబాబు మాత్రం ఎన్నికల సందర్భంగా డబ్బు ఏర్పాటు చేసుకోవడానికి ప్రతిపక్ష నేత విదేశాలకు వెళ్తున్నారంటూ ఆరోపించడం హస్యాస్పదంగా ఉందన్నారు. అంటే టీడీపీ నాయకులు విదేశీ పర్యటనలు చేసేది డబ్బు ఏర్పాటు చేసుకునేందుకేనా అంటూ ప్రశ్నించారు. టీడీపీ వ్యవహారశైలి నచ్చకే ఆ పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు పార్టీని వీడుతున్నారని ఆయన ఆరోపించారు.