కేసిఆర్‌ బాహుబలి..ఆయననేం చేయలేరు

మానుకోట సభలో కడియం ఉద్వేగ ప్రసంగం

మహబూబాబాద్‌,నవంబర్‌3(జ‌నంసాక్షి): ముఖ్యమంత్రి, తెరాస అధినేత కేసీఆర్‌ తెలంగాణ బాహుబలి అని, ఆయనను అడ్డుకొనే శక్తి ఎవరికీ లేదని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి అన్నారు. ఏ ప్రభుత్వమైనా.. తెరాసలాగా సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెట్టిందా? అని ప్రశ్నించారు. మానుకోటలో జరిగిన ఆశీర్వాద సభలో ఆయన మాట్లాడారు. కల్యాణలక్ష్మి పథకం రాకముందు ఆడపిల్లను గుండెలపై కుంపటిగా భావించేవారన్నారు. కేసీఆర్‌ పేద ప్రజల సంక్షేమం కోసం కృషిచేశారని, ఆయనను ఒంటరిగా ఎదుర్కోలేకే ప్రతిపక్షాలు మహాకూటమిగా ఏర్పాటై ప్రజల ముందుకు వస్తున్నాయన్నారు. ఎన్ని కూటములు వచ్చినా కేసీఆర్‌ను అడ్డుకోలేవని చెప్పారు. అది మహాకూటమి కాదని, దగా కూటమి అని కడియం మండిపడ్డారు.