‘కొలువులకై కొట్లాట’ విజయవంతం చేయండి
– అరెస్టు చేసిన వారిని తక్షణమే విడుదల చేయాలి
– టీజేఏసీ చైర్మన్ కోదండరాం
హైదరాబాద్, డిసెంబర్4(జనంసాక్షి) : కొలువులకై కొట్లాట సభకు కోర్టు ఆదేశాలు, పోలీసుల అధికారిక అనుమతి ఉన్నప్పటికీ అడ్డుకోవడానికి ప్రయత్నించడం దారుణమని ఐకాస ఛైర్మన్ కోదండరామ్ అన్నారు. సోమవారం ఆయన మాట్లాడుతూ సభకు వచ్చేవారిని పోలీసులు నిర్బంధించడం, అరెస్టు చేయడాన్ని తాము ఖండిస్తున్నట్లు తెలిపారు. అరెస్టు చేసిన వారిని తక్షణం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ వ్యాప్తంగా టీజేఏసీ నాయకులను విద్యార్థి నేతలను అర్థరాత్రి దాటిన తర్వాత పోలీసులు అరెస్ట్ చేశారని కోదండరామ్ తెలిపారు. మరోవైపు ఓయూ హాస్టళ్లపై పోలీసులు అర్థరాత్రి దాడి చేసి విద్యార్థులను, విలేకరులపై లాఠీఛార్జి చేశారన్నారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా ఈరోజు కొలువులపై కొట్లాట సభ జరిగి తీరుతుందన్నారు. తెలంగాణ యువత పెద్దయెత్తున ఈ సభకు తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.