కోడలిని కిరాతకంగా హత్యచేసిన మామ

మహబూబ్‌నగర్‌,జనవరి23(జ‌నంసాక్షి): మహబూబ్‌నగర్‌ జిల్లా కృష్ణా మండలంలోని ముడుమాల్‌ గ్రామంలో

బుధవారం తెల్లవారుజామున దారుణం చోటు చేసుకుంది. స్వయనా కొడలిని రోకలి బండతో కొట్టి మామ హత్య చేశాడు. పోలీసుల కథనం ప్రకారం.. ముడుమాల్‌ గ్రామానికి చెందిన పోతుల శాంతప్ప పెద్ద కుమారుడు మహాదేవ్‌కు చందాపూర్‌కు చెందిన లక్ష్మి (33)తో పదేళ్ల క్రితం వివాహం జరిగింది. ఆరేళ్ల క్రితం అనారోగ్యంతో మహదేవ్‌ మృతి చెందాడు. అప్పటి నుంచి మామ శాంతప్ప ఉంటున్న ఇంట్లోనే లక్ష్మి కూడా నివాసం ఉంటోంది. కాగా ఆమెపై ఉన్న అనుమానంతో బుధవారం తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో రోకలి బండతో కొట్టి హత్య చేశాడు. అనంతరం నిందితుడు పోలీసులుకు లొంగిపోయాడు. లక్ష్మి కుమారుడు హాస్టల్‌లో ఉండి చదువుకుంటున్నాడు. ఈ సంఘటనపై ఎస్సై నరేశ్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.