కోర్టులో దారుణం


` న్యాయవాద దుస్తుల్లో వచ్చి గ్యాంగ్‌స్టర్‌ హత్య
` ఎదురుకాల్పుల్లో ఇద్దరు దుండగులు మృతి
దిల్లీ,సెప్టెంబరు 24(జనంసాక్షి):దేశ రాజధానిలో పట్టపగలే కాల్పుల కలకలం చోటుచేసుకుంది. దిల్లీలోని రోహిణి కోర్టు ఆవరణలో ఓ గ్యాంగ్‌స్టర్‌ లక్ష్యంగా ప్రత్యర్థి గ్యాంగ్‌ కాల్పులకు పాల్పడిరది. ఈ ఘటనలో గ్యాంగ్‌స్టర్‌ జితేందర్‌ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. అదే సమయంలో పోలీసులు జరిపిన ఎదురు కాల్పుల్లో ఇద్దరు దుండగులు హతమయ్యారు. పట్టపగలే జరిగిన ఈ కాల్పుల ఘటనలో మరికొందరికి గాయాలైనట్లు సమాచారం.
లాయర్ల వేషంలో వచ్చి..
దిల్లీలో మోస్ట్‌ వాంటెడ్‌ గ్యాంగ్‌స్టర్‌గా ఉన్న జితేందర్‌ గోగి ప్రస్తుతం తిహార్‌ జైల్లో శిక్ష అనుభవిస్తున్నాడు. ఓ కేసు విచారణలో భాగంగా శుక్రవారం నాడు ఆయనను రోహిణిలోని కోర్టుకు తరలించారు. అదే సమయంలో న్యాయవాదుల వేషధారణలో వచ్చినముగ్గురు ప్రత్యర్థి గ్యాంగ్‌ సభ్యులు కోర్టు ఆవరణలోనే గ్యాంగ్‌స్టర్‌ జితేందర్‌ గోగిపై కాల్పులకు తెగబడ్డారు. ఇద్దరు దుండగులు దాదాపు 35 నుంచి 40 రౌండ్లు కాల్పులు జరిపినట్లు సమాచారం. సినీఫక్కీలో జరిగిన ఈ దాడిలో జితేందర్‌ అక్కడిక్కడే మృత్యువాతపడ్డాడు. అదే సమయంలో అప్రమత్తమైన దిల్లీ స్పెషల్‌సెల్‌ పోలీసులు.. దుండగులపై ఎదురు కాల్పులు జరిపారు. దీంతో ఇద్దరు దుండగులు ప్రాణాలు కోల్పోయారు. అయితే, కాల్పులకు పాల్పడిన వారిని టిల్లు తాజ్‌ పూరియా గ్యాంగ్‌ సభ్యులుగా అనుమానిస్తున్నామని రోహిణి డీసీపీ ప్రణవ్‌ తయాల్‌ పేర్కొన్నారు.
గ్యాంగ్‌స్టర్‌ జితేందర్‌గోగిపై పలు క్రిమినల్‌ కేసులు ఉన్నాయి. ఈ మధ్యే ఓ వ్యాపారవేత్తను రూ.5కోట్లు ఇవ్వాలని బ్లాక్‌మెయిల్‌ చేయడంతో ఆయనపై కేసు నమోదయ్యింది. ఈ కేసులో భాగంగా జితేందర్‌ను దిల్లీ స్పెషల్‌సెల్‌ పోలీసులు ఇటీవలే అరెస్టు చేశారు. ప్రస్తుతం జితేందర్‌గోగి తిహాడ్‌ జైల్లో ఉన్నారు. తాజాగా విచారణలో భాగంగా జితేందర్‌ గోగిని రోహిణి కోర్టుకు తీసుకువచ్చిన సమయంలో ఈ దాడి జరిగింది. అయితే, జైల్లో ఉన్న సమయంలోనే గ్యాంగ్‌స్టర్‌ జితేందర్‌ నుంచి 3 సెల్‌ఫోన్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. గతంలో ఆయనపై దిల్లీ పోలీసులు రూ.6లక్షల రివార్డు కూడా ప్రకటించారు.