కోలుకున్న స్టాక్‌ మార్కెట్‌లు 


– ఊపిరిపీల్చుకున్న ముదుపరులు
ముంబయి, సెప్టెంబర్‌14(జ‌నంసాక్షి) : వరుస నష్టాల నుంచి తేరుకున్న స్టాక్‌ మార్కెట్‌లు భారీ లాభాల దిశగా పరుగులు తీశాయి. రూపాయి పుంజుకోవడం, కొనుగోళ్ల మద్దతుతో శుక్రవారం నాటి ట్రేడింగ్‌లో భారీ
లాభాలను సాధించిన సూచీలు వారం రోజుల గరిష్ఠానికి చేరాయి. శుక్రవారం మార్కెట్‌ సెషన్‌లో సెన్సెక్స్‌ 370 పాయింట్లకుపైగా ఎగబాకి మళ్లీ 38వేల మార్క్‌ను దాటింది. నిఫ్టీ కూడా భారీగానే లాభపడింది.
అంతర్జాతీయ మార్కెట్లు సానుకూలంగా ఉండటం, డాలర్‌తో రూపాయి మారకం విలువ కోలుకోవడంతో శుక్రవారం ఉదయం సూచీలు ఉత్సాహంగా ప్రారంభమయ్యాయి. బాంబే స్టాక్‌ ఎక్స్ఛేంజీ సెన్సెక్స్‌ 200 పాయింట్లకుపైగా లాభంతో ట్రేడింగ్‌ను ఆరంభించగా.. నిఫ్టీ కూడా మళ్లీ 11,500 మార్క్‌ పైన ట్రేడ్‌ అయ్యింది. అయితే ఆ తర్వాత కాస్తతడబడినా బ్యాంకింగ్‌, లోహ, స్థిరాస్తి, ఆటోమొబైల్‌, హెల్త్‌కేర్‌, విద్యుత్‌ తదితర రంగాల్లో వెల్లువెత్తిన కొనుగోళ్లు మార్కెట్‌ సెంటిమెంట్‌ను బలపర్చాయి. ఫలితంగా మధ్యాహ్నం సెషన్‌లో మార్కెట్లు భారీ లాభాల్లో దూసుకెళ్లాయి. ఒక దశలో సెన్సెక్స్‌ 400 పాయింట్ల వరకు లాభపడింది. చివరకు 373 పాయింట్ల లాభంతో 30,091 వద్ద ముగిసింది. నేషనల్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజీ నిఫ్టీ 145 పాయింట్లు లాభపడి 11,515 వద్ద స్థిరపడింది. డాలర్‌తో రూపాయి మారకం విలువ రూ.23 పైసలు కోలుకుని 71.95గా కొనసాగుతోంది. ఎన్‌ఎస్‌ఈలో ఇండియాబుల్స్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌ లిమిటెడ్‌, భారత్‌ పెట్రోలియం, బజాజ్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌, హిందుస్థాన్‌ పెట్రోలియం, వేదాంతా లిమిటెడ్‌ షేర్లు భారీగా లాభపడగా హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌, కోల్‌ఇండియా, ఇన్ఫోసిస్‌, గెయిల్‌ షేర్లు స్వల్పగా నష్టపోయాయి.