ఖమ్మంలో ఉద్రిక్తత

ఆర్టీసీ కార్మికులను రానీయని పోలీసులు
ఖమ్మం,నవంబరు 26(జనం సాక్షి): 52 రోజుల తరువాత రాష్ట్ర వ్యాప్తంగా విధుల్లోకి చేరేందుకు వస్తున్న ఆర్టీసీ కార్మికులను పోలీసులు అరెస్ట్‌ చేస్తున్నారు.  తమ డిమాండ్లను నెరవేర్చాలంటూ ఆర్టీసీ కార్మికులు 52 రోజుల పాటు సమ్మెబాటపట్టారు. సమ్మెపై కోర్ట్‌ లో విచారణ జరుగుతుండగా..మంగళవారం నుంచి కార్మికులు విధుల్లోకి చేరాలని ఆర్టీసీ జేఏసీ నేతల పిలుపునిచ్చారు. జేఏసీ నేతల పిలుపుతో విధుల్లో చేరేందుకు కార్మికులు డిపోలకు తరలివస్తున్నారు. ఖమ్మంలో దగ్గర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. డ్యూటీలో చేరేందుకు వస్తున్న ఆర్టీసీ కార్మికులను అడ్డుకుంటున్నారు పోలీసులు. వామపక్షాల నేతలను ముందస్తుగా అరెస్టు చేశారు. ఖమ్మం బస్‌ డిపో, బస్టాండ్‌ ప్రాంతాల్లో భారీగా పోలీస్‌ బంద్‌ బస్తు ఏర్పాటు చేశారు. పార్టీల నేతలు, కార్మికులు అటువైపు రాకుండా బారీకేడ్లు పెట్టారు. ఆర్టీసీ జేఏసీ పిలుపుపై స్పందించిన ఆర్టీసీ ఇంఛార్జ్‌ ఎండీ సునీల్‌ శర్మ.. ఆర్టీసీ కార్మికులు చట్ట విరుద్ధమైన సమ్మెలో ఉన్నారు. డ్యూటీలకు రాకుండా, వారి ఇష్టమొచ్చినప్పుడు డ్యూటీల్లో చేరతామనడం నిబంధనల ప్రకారం సాధ్యం కాదు. హైకోర్టు చెప్పిన దాని ప్రకారం పక్రియ అంతా ముగిసే వరకు కార్మికులను డ్యూటీల్లో చేర్చుకోవడం కుదరదు’ అని    తేల్చిచెప్పారు. మంగళవారం నుంచి డ్యూటీల్లో చేరతామంటూ ఆర్టీసీ జేఏసీ చేసిన ప్రకటన హాస్యాస్పదంగా ఉందని ఆయన అన్నారు.