గచ్చిబౌలిలో బస్సు బీభత్సం

– అదుపుతప్పి పాదచారులపైకి దూసుకెళ్లిన బస్సు
– ప్రమాదంలో ముగ్గురు మృతి
– కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు
హైదరాబాద్‌, సెప్టెంబర్‌10(జ‌నంసాక్షి) : హైదరాబాద్‌ నగరంలో గచ్చిబౌలి చౌరస్తా వద్ద ఓ ఆర్టీసీ బస్సు సోమవారం బీభత్సం సృష్టించింది. బస్టాప్‌లో ఉన్న ప్రయాణికుల విూదకు బస్సు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ముగ్గురు ప్రయాణికులు అక్కడికక్కడే మృతిచెందారు. వేగంగా వచ్చిన సిటీ బస్సు.. బస్టాప్‌లో నిల్చున్న ముగ్గురు వ్యక్తులను ఢీకొట్టిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. హెచ్‌సీఐ డిపోకు చెందిన బస్సు లింగంపల్లి నుంచి కోఠి వెళ్తోంది. ఉదయం 8గంటల సమయంలో గచ్చిబౌలి చౌరస్తా వద్దకు చేరుకున్న బస్సు మరో బస్సును తప్పించబోయి రోడ్డు దాటుతున్న పాదచారులపైకి ఒక్కసారిగా దూసుకెళ్లింది. దీంతో ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందారు. మృతుల్లో దశరథ్‌ అనే ఆటో డ్రైవర్‌ కూడా ఉన్నాడు. ఆ సమయంలో ఆటో డ్రైవర్‌ ఓ వృద్ధుడిని రోడ్డు దాటించే ప్రయత్నం చేస్తున్నట్లు స్థానికులు తెలిపారు.  కాగా ఈ ప్రమాదంలో వృద్డుడు కూడా మృతి చెందాడు. మరొకరు ముంబయికి చెందిన వ్యక్తి అని, అప్పుడే వేరు బస్సు దిగి మరో బస్సు ఎక్కేందుకేదుకు బస్టాండ్‌ వద్ద ఉండటంతో ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు తెలిసింది. కాగా ఇద్దరి ఆచూకీ కోసం పోలీసలు విచారణ చేపట్టారు. వీరి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని కేసు నమోదుచేసి విచారణ చేపట్టారు. నిర్లక్ష్యంగా వాహనం నడిపి ప్రమాదానికి కారణమైన డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తెలంగాణ ఆర్టీసీకి చెందిన ఏపీ 11జెడ్‌ 6172 నెంబరు బస్సు, కోటి నుంచి లింగపల్లి వెళుతుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా వచ్చిన బస్సు స్టాప్‌లోకి దూసుకెళ్లడంతో కింద చిక్కుకుపోయిన వారిని తోటి ప్రయాణికులు బయటకు తీశారు. అయితే, అప్పటికే వారు మృతిచెందారు.  మృతుల్లో ముంబయికి చెందిన వ్యక్తి ఉన్నట్లు స్థానికులు పేర్కొన్నారు. ఇదిలాఉంటే ఆగస్టు 12 న కూడా ఇదే ప్రాంతంలో బస్సు నుంచి జారి పడి ఓ కండక్టర్‌ ప్రాణాలు కోల్పోయాడు. నాగర్‌ కర్నూల్‌ జిల్లాకు చెంది రాములు టీఎస్‌ ఆర్టీసీ కూకట్‌పల్లి డిపోలో విధులు నిర్వహిస్తున్నాడు. యథావిధిగా విధుల్లో ఉండగా గచ్చిబౌలిలోని ఓ మలుపు వద్ద దురదృష్టం వెంటాడింది. నానక్‌రామ్‌గూడ వేవ్‌ రాక్‌ కూడలి వద్ద సిటీ బస్సు యూటర్న్‌ తీసుకొంటుండగా వెనక డోర్‌లో ఉన్న కండక్టర్‌ రాములు అదుపుతప్పి కిందపడిపోయాడు. దీంతో ఆయన తీవ్రంగా గాయపడిన ఆయన చికిత్స పొందుతూ మృతిచెందారు.