గుజరాత్‌ తీర్పుపై గుబులు

– రెండంకెలకే కట్టడి
– భాజపా అధిష్టానం మల్లగుల్లాలు
అహ్మదాబాద్‌,డిసెంబర్‌ 19,(జనంసాక్షి): గుజరాత్‌ ఫలితాలు ఓ రకంగా బిజెపికి వ్యతిరేకంగా, కాంగ్రెస్‌కు అనుకూలంగా ఉన్నాయనే భావించాలి. సమర్థ నాయకుడు లేకున్నా, వాఘేలా లాంటి వారు వెళ్లిపోయినా కాంగ్రెస్‌ బిజెపిని పరుగులు పెట్టించింది. పార్టీ స్థానాలు మూడంకెలకు చేరలేకపోయాయి. రావాల్సిన ఆధిక్యం కంటే కేవలం ఏడు స్థానాలే ఎక్కువగా రావడం కమలనాథులను ఉలికిపాటుకు గురిచేసిందనే చెప్పాలి. అలాగే గతం కన్నా 16 సీట్లు తగ్గడమే గాకుండా అధికారంలోకి రావడానికి అత్తెసరు సీట్లను సంపాదించుకుని వంద సంఖ్యను కూడా దాటలేకపోయింది. ప్రజల్లో ఉన్న వ్యతిరేకతకు ఈ ఫళితాలు నిదర్శనమని గుజరాత్‌ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. రెండోదశలో ప్రధాని మోడీ సుడిగాలి పర్యటన చేయడం వల్ల మాత్రమే ఈ మాత్రం సీట్లయినా దక్కించుకోగలిగారు. ప్రధాని మోడీ, పార్టీ జాతీయాధ్యక్షుడు అమిత్‌షాలకు గుజరాత్‌  సొంత రాష్ట్రం కావడం, దేశవ్యాప్తంగా అనేకచోట్ల వారు గుజరాత్‌ నమూనా గురించే ఘనంగా చెబుతూ రావడంతో సహజంగానే అన్ని వర్గాల దృష్టీ ఆ రాష్ట్రంపై పడింది. 15 రోజుల్లో 34 సభల్లో మోదీ పాల్గొన్నారు. గుజరాతీ భూమి పుత్రునిగా చెబుతూ ఓటర్లపై తనదైన శైలిలో బలమైన ముద్రవేసినా ఫలితాల్లో మాత్రం ప్రస్ఫుటం కాలేదు. బలమైన పార్టీ శ్రేణుల్ని బూత్‌స్థాయి వరకు అమిత్‌షా వికేంద్రీకరించారు. జూన్‌ నాటికే ఈ పని పూర్తిచేసి, జాతీయాధ్యక్షునిగా 7500 మంది కార్యకర్తలతో నేరుగా ఫోన్లో మాట్లాడారు. 6665 కి.విూ. మేర సుడిగాలిగా తిరిగారు. మోదీ, షా ఎంత ప్రయత్నించినా కాంగ్రెస్‌ నుంచి అనూహ్యంగా ఎదురైన పోటీతో భాజపా హవాకుగండిపడింది.  అనేక ఎగ్జిట్‌పోల్స్‌ చెప్పిన సంఖ్య కంటే కూడా  తక్కువ సీట్లను రాబట్టగలిగారు. అంటే ఎంతగా వ్యతిరేకత ఉందో చూడలని వ్యాపారవర్గాలు అంటున్నాయి. దీనికంతటికి జిఎస్టీ కారణమని అంటున్నారు. గుజరాత్‌లో నూటయాభై స్థానాలు నెగ్గాలన్నది బీజేపీ అధ్యక్షుడిగా షా ప్రకటించారు. సెంచరీకి ఒకటి తక్కువగా పరుగు ఆగిపోయినా, కనీస మెజారిటీ కంటే ఏడు స్థానాలే ఎక్కువ సాధించగలిగినా, ఉన్నవాటిలో పదహారు కోల్పోయినా ఇలా ఆరోసారి అధికారాన్ని నిలబెట్టుకోవడంతో చావుతప్పి కన్నులొట్టబోయిందన్న చందంగా మారింది. ప్రధాని నరేంద్ర మోదీ అలుపెరగకుండా ప్రచారం చేసిన తరువాత కూడా అత్తెసరు సీట్లు వచ్చాయి. అవికూడా రాకుండా కాంగ్రెస్‌ పొరపాటును నెగ్గివుంటే అది దేశ రాజకీయాలను కుదిపేసేదే. విపక్ష శక్తులన్నింటికీ ప్రాణం పోసివుండేది. శిసేన ఇప్పటికే కత్తులు నూరుతోంది.  గుజరాత్‌లో రెండు దశాబ్దాలకుపైగా అధికారానికి దూరంగా ఉంటూ వ్యవస్థాగత నిర్మాణం విచ్ఛిన్నమైపోయివున్న స్థితిలోనూ కాంగ్రెస్‌ గతంలో కంటే అత్యధిక  స్థానాలు నెగ్గగలగిందంటే అందుకు మోడీ జిఎస్టీ పుణ్యమే తప్ప కాంగ్రెస్‌ గొప్పతనమేవిూ లేదని స్థానిక వ్యాపారాలు వాదిస్తున్నారు. నరేంద్రమోదీ ఎంతో శ్రమకోర్చి స్వరాష్టాన్న్రి కాపాడుకున్నామన్న ధీమా మాత్రమే మిగిలింది తప్ప రాజకయీంగా ఓటమి పొందారని గుర్తించాలి. బహుశా గుజరాత్‌ ఎన్నికల ఫలితాలు మోదీకి ఖేదంగా మిగిలితే,ఇటు కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీకి ఎన్నటికీ మరిచిపోలేని సంతృష్తిని మిగిల్చాయని చెప్పకతప్పదు. అనూహ్యంగా తెరపైకి వచ్చిన దళిత నేత జిగ్నేష్‌ మేవానీ, ఓబీసీ నేత అల్పేష్‌ ఠాకూర్‌ వంటివారు ఈ ఎన్నికల్లో మంచి మెజారిటీతో నెగ్గుకురావడం అక్కడ మారుతున్న రాజకీయచిత్రానికి నిదర్శనాలు. చాలా చోట్ల స్వల్ప వ్యత్యాసంలో కాంగ్రెస్‌ ఓడిపోవడం కూడా ఓట్లుగా మార్చుకోలేకపోయిన దాని అసమర్థతతో పాటు రాహుల్‌ రాజకీయం బాగానే పనిచేసినట్టు చెబుతున్నది.  అలాగే కాంగ్రెస్‌ కొత్త అధ్యక్షుడు రాహుల్‌గాంధీకి గుజరాత్‌ ఫలితాలు కొంత ఉత్తేజాన్ని ఇస్తాయి. ఆయన ప్రచారశైలి, పెరిగిన కొన్ని స్థానాలు మోదీతో పోరాడగలగడన్న నమ్మకం పార్టీలో పెరిగింది.  బీఎస్పీ, ఎన్సీపీ వంటి పార్టీలను కొన్ని కారణాలవల్ల గుజరాత్‌లో కలుపుకోలేకపోయినా, సార్వత్రిక ఎన్నికల్లో మోదీని బలంగా ఢీకొనాలంటే చేతికి చేయూత అవసరమని ఈ ఫలితాలు గుర్తు చేస్తున్నాయి. గతంలో మాదిరిగా రాహుల్‌ను పప్పు అంటూ తీసిపారేయడం సులభం కాదనీ, సార్వత్రిక ఎన్నికలు నల్లేరు విూద నడక కాబోదని బీజేపీకి గుర్తుచేస్తున్నాయి. ఐదుపర్యాయాలు అధికారంలో ఉన్న తరువాత సహజసిద్ధంగా వచ్చే ప్రభుత్వ వ్యతిరేకతతో పాటు,  ప్రధానిగా మోడీ అనుసరించిన విధానాలు కూడా ప్రజలకు రుచించక పోవడంతో ప్రజల్లో తీవ్ర అసంతృప్టి గూడుట్టుకుని ఉంది. స్థానిక అంశాలతో పాటు, తాను తెచ్చిన జీఎస్టీకి వ్యతిరేకంగా గుజరాత్‌ ప్రజలు ఆగ్రహంగా ఉన్నారని గుర్తించాలి. ఓ రకంగా చివరి క్షణంలో ప్రజలు మళ్లీ కొంత బిజెపివైపు మొగ్గు చూపారు. జీఎస్టీవిూద మండిపడి పదిహేనురోజుల పాటు గేట్లు మూసుకున్న సూరత్‌ కూడా ఎన్నికల్లో మోడీ పక్షానే నిలిచింది. జీఎస్టీ వ్యతిరేకతను క్యాష్‌ చేసుకోవాలని అనుకున్న కాంగ్రెస్‌కు ఈ పారిశ్రామిక ప్రాతం నుంచి ఒకేస్థానం దక్కింది. బీజేపీ విూద ఎంత వ్యతిరేకత ఉన్నా కాంగ్రెస్‌ను ఇప్పటికీ నమ్మలేకపోవడానికి ఇదే కారణంగా చూడాలి. బీసీ ¬దా ఇస్తానని చెప్పినప్పటికీ పటేళ్ళు కాంగ్రెస్‌ పక్షాన మోహరించక పోవడంతో పాటు, బీసీలు కూడా దూరమైనారని కొందరి విశ్లేషణ. హార్దిక్‌ పటేల్‌ ప్రభావం పెద్దగా లేదంటున్నా, ఈ ఫలితాల్లో బీజేపీ గ్రావిూణ ప్రాంతాలవారి ఆదరణకు దూరమైన పరిస్థితి మాత్రం కనిపిస్తున్నది. పట్టణప్రాంతాల్లో పెరగడమే తప్ప ఏమాత్రం తరగని మోదీ ప్రేమే ఈ ఎన్నికల్లో బీజేపీని ఎదురుగాలి నుంచి గట్టెక్కించింది. మత ఘర్షణల బారినపడి, మత చీలికలు కూడా బలంగా ఉన్నందున పట్టణ ప్రజలు మరోమారు మోదీని ఆదరించారు. వ్యవసాయ విధ్వంసం, దళితులపై దాడులు, రిజర్వేషన్ల ఉద్యమం వంటివి గ్రావిూణ ప్రాంతాల్లో ప్రభాఇతం చేయడంతో కాంగ్రెస్‌ బలం పెంచుకోగలిగింది. మతం ఆధారంగా పాతికేళ్ళుగా తనతో కట్టిపడేసుకున్న కులాలను గతంలో మాదిరిగా కులప్రాతిపదికన కాంగ్రెస్‌ తన్నుకుపోతుందన్న భయం బీజేపీలో అధికంగా కనిపించింది. పనితీరు కంటే ఓట్ల క్షేత్రంలో సూక్ష్మస్థాయి నిర్వహణెళి బీజేపీని పెద్ద ప్రమాదం నుంచి బయటపడవేసినట్టు కనిపిస్తున్నది.