గుదిబండగా మారిన ఆటోస్టార్టర్లు

ఇంకా తొలగింపు అంతంత మాత్రమే
తడిసి మోపెడు అవుతున్న విద్యుత్‌ భారం
హైదరాబాద్‌,మే17(జ‌నం సాక్షి): విద్యుత్‌ రంగంలో వ్యవసాయానికి 24 గంటల కరెంట్‌ సరఫరా జరుగుతున్నది. నిజంగా ఇదో చారిత్రక ఘట్టంగానే చూడాలి. ఇప్పటికే 24గంటల కరెంటు సరఫరాను అమలు చేశాక లెక్కలు చూస్తే వినియోగం భారీగా పెరిగిందని తెలుస్తోంది. అయితే ఇదే దశలో గతంలో రైతులు పెట్టుకున్న ఆటోస్టార్టర్ల తొలగింపు జరగలేదు. దీంతో కూడా బోర్లు నిరంతరంగా పనిచేయడం వల్ల వినియోగం ఇబ్బడిముబ్బడిగా పెరుగుతోంది. మరోవైపు భూగర్భ జలాలు కూడా అడుగంటుతున్నాయి. దీనిపై ప్రచార కార్యక్రమం జరగాలి. అలాగే మరోవైపు కొందరు ఇటుకబట్టీలు తదితర కార్యక్రమాలకు నిరంతర విద్యుత్‌ను ఉచితంగా వాడుకుంటున్నారన్న ఆరోపణలు ఉన్‌ఆనయి.  గత జనవరి  నుంచి పూర్తిస్థాయిలో నిరంతర విద్యుత్‌ సరఫరా జరుగుతోంది. 24గంటల నిరంతర విద్యుత్‌ సరఫరాతో రైతులకు ప్రయోజనం చేకూరనుంది. దీనిపై రైతుల సర్వాత్రా హర్షం వ్యక్తం చేస్తుండగా, ప్రభుత్వం సరిపడా కరెంటు సరఫరా చేస్తున్న దృష్ట్యా రైతులు తమ వ్యవసాయ పంపుసెట్లకు బిగించిన ఆటో స్టార్టర్లు వెంటనే తొలగించుకోవాలని ట్రాన్స్‌కో అధికారులు కోరారు. వ్యవసాయానికి 24గంటల విద్యుత్‌ సరఫరా విజయవంతం కోసం జిల్లాల్లో ట్రాన్స్‌కో రెండు వారాలు ప్రయోగాత్మక పరిశీలన చేసింది. అయితే ఆటో స్టార్టర్లు తొలగించకుంటే విద్యుత్‌ సరఫరాపై లోడ్‌ పెరుగుతుందని గుర్తించిన అధికారులు వాటి తొలగింపుపై దృష్టి సారించారు. అంతేకాకుండా నూటికి నూరుశాతం ఆటోస్టార్టర్లు తొలగించకుంటే విద్యుత్‌ వృథాతోపాటు భూగర్భ జలాలపై తీవ్ర ప్రభావం చూపుతుందని గుర్తించింది.  ఆరుగాలం శ్రమించి రెక్కలు ముక్కలు చేసుకుని వ్యవసాయం చేసే రైతన్నకు కొత్త సంవత్సరంలో తెలంగాణ ప్రభుత్వం నిరంతర విద్యుత్‌ కానుక అందిస్తోంది. కరెంటు కష్టాల నుంచి ఎప్పుడు గట్టెక్కుతామని ఎదురుచూస్తున్న రైతన్నకు ఇదో వరంగా మారింది. ఒకప్పుడు కరెంటు ఎపస్పుడొస్తుందో తెలియక  రాత్రి, పగలు కరెంటు కోసం కళ్లు కాయలు చేసుకొని అవస్థలు పడిన అన్నదాతకు  సిఎం కెసిఆర్‌ వరంలా నిరంతర విద్యుత్‌ సరఫరా చేస్తున్నారు.
స్వరాష్ట్రం సాధించుకున్న మూడేళ్లలోనే తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయానికి తొమ్మిది గంటల నుంచి ఏకంగా 24 గంటల నిరంతర విద్యుత్‌ సరఫరా స్థాయికి చేరింది. ఉమ్మడి రాష్ట్ర పాలనలో రైతులకు పేరుకు మాత్రమే 7గంటల సరఫరా ఉన్నా..కనీసం మూడు, నాలుగు గంటలు కూడా సక్రమంగా సరఫరా కాని పరిస్థితి. రైతులు రోడ్డెక్కని రోజు లేదు..ధర్నాలు..రాస్తారోకోలు..విద్యుత్‌ సబ్‌స్టేషన్లపై దాడులు, ఫర్నిచర్‌
దగ్ధం, ధ్వంసం ఘటనలు నిత్యకృత్యం అయినా పాలకులు పట్టించుకునే వారు కాదు. ఎప్పుడు వస్తుందో..ఎప్పుడు పోతుందో తెలియని అయోమయం..గందరగోళ పరిస్థితుల నడుమ రైతులు పంపుసెట్లు, బావుల వద్ద పడిగాపులు పడుతూ కంటివిూద కనుకులేకుండా గడిపేవారు. రాత్రి కరెంటు కోసం బావుల వద్దకు వెళ్లిన అనేక మంది రైతుల విద్యుత్‌ షాక్‌ లేదంటే పాము కాటుకు గురై మృత్యువాత పడిన ఘటనలు కోకొల్లలు. 2014 ఎన్నికల మేనిఫెస్టోలో రైతులకు నాణ్యమైన విద్యుత్‌ అందిస్తామని ప్రకటించిన టీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చిన వెంటనే విద్యుత్‌ రంగంలో భారీ మార్పులు, సరికొత్త సంస్కరణలకు శ్రీకారం చుట్టింది. తొలుత 7గంటల మెరుగైన విద్యుత్‌ను అందించిన ప్రభుత్వం 2016 ఏప్రిల్‌ 1 నుంచి వ్యవసాయానికి తర్వాత 9 గంటల నాణ్యమైన కరెంటును అందించి 2014 ఎన్నికల మేనిఫెస్టోలో రైతులకు ఇచ్చిన హావిూ నెరవేర్చి వారి మన్ననలు పొందింది. వ్యవసాయంలో అన్నదాతలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను అధిగమించేందుకు  2017 డిసెంబర్‌ 31 అర్ధరాత్రి నుంచి నిరంతర విద్యుత్‌ సరఫరాకు శ్రీకారం చుట్టింది. అయితే ఆటోస్టార్టర్లు విఘాతంగా మారుతాయని ట్రాన్స్‌కో ఆందోళన వ్యక్తం చేసి గ్రామాల్లో  ప్రచారం చేసినా ఇంకా  స్టార్టర్లను తొలగించడం లేదు. రైతులు స్వచ్ఛందంగా తొలగించుకుంటే సాగుకు సరిపడా విద్యుత్‌ అందజేయడం ద్వారా గణనీయమైన వ్యవసాయ ఉత్పత్తులు సాధించి రైతుల్లో ఆత్మవిశ్వాసం పెరుగుతుందని ప్రభుత్వం భావిస్తోంది. ప్రధానంగా రైతులు తమ వ్యవసాయ క్షేత్రాలు, పొలాల్లో ఏర్పాటు చేసుకున్న ఆటోస్టాట్టర్ల వినియోగం ద్వారా కలిగే అనర్థాలపై రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. రైతులు తప్పనిసరి ఆటోస్టార్టర్లు తొలగించుకోవాలని ట్రాన్స్‌కో అధికారుల
సూచనలు పాటించాలి. అప్పుడే లక్ష్యం సిద్దించగలదు.
—————–