గొర్రెల పంపిణీతో పాటు గడ్డి పెంపకం

సిద్దిపేట,డిసెంబర్‌2(జ‌నంసాక్షి): ప్రభుత్వం పంపిణీ చేస్తున్న గొర్రెలకు అవసరమైన మేత కోసం స్టైలో గడ్డిని వచ్చే ఏడాది నుంచి పెంచుతామని రాష్ట్ర గొర్రెల అభివృద్ధి సహకార సంఘాల సమాఖ్య అధ్యక్షుడు రాజయ్యయాదవ్‌ తెలిపారు. దాదాపు 50 లక్షల ఎకరాల్లో దీనిని పెంచుతామన్నారు. వీటినుంచి సేంద్రియ ఎరువు, మాంసం ఉత్పత్తితో గొల్లకుర్మలను ఆర్థికంగా నిలబెట్టేలా చర్యలు చేపడుతున్నామని చెప్పారు. శనివారం ఆయన సిద్దిపేటలో తనను కలసిని విలేకర్లతో మాట్లాడారు. గొర్రెల వైద్య సౌకర్యం కోసం 1962 మొబైల్‌ అంబులెన్సు వాహనాన్ని అందుబాటులో ఉంచామని పేర్కొన్నారు.ఈ ఆర్థిక సంవత్సరం చివరిలోగా రాష్ట్రంలో అనుకున్న లక్ష్యానికి అనుగుణంగా 3.60లక్షల మంది గొర్రెల కాపరుల సంఘ సభ్యులకు గొర్రెలను పంపిణీ చేస్తామని అన్నారు. గొర్రెల కాపరుల సంఘంలో సభ్యులందరికి 75 శాతం రాయితీపై బ్యాంకుతో సంబంధం లేకుండా 21 గొర్రెలను పంపిణీ చేయాలని నిర్ణయించి అమలు చేస్తున్నామన్నారు. రాష్ట్రంలో 7,500 గొర్రెల సొసైటీలు నమోదయ్యాయని ఇందులో 7.60 లక్షల మంది సభ్యులు ఉన్నారని చెప్పారు. ఈ ఏడాది సంఘాల్లో ఉన్న సగం మంది సభ్యులకు గొర్రెలు పంపిణీ చేయాలని నిర్ణయించామన్నారు. ఇప్పటి వరకు 1.40 లక్షల గొర్రెలు ఇచ్చామని తెలిపారు. మార్చి నెలాఖరులోగా మిగిలిన వారికి అందజేస్తామని చెప్పారు.