గొర్రెల యూనిట్ల లక్ష్యం సాధిస్తాం

నిజామాబాద్‌,డిసెంబర్‌2(జ‌నంసాక్షి): ఈ ఏడాది గొర్రెల యూనిట్ల కొనుగోలు లక్ష్యాన్ని ఎలాగైనా పూర్తి చేసేందుకు కృషి చేస్తామని అధికారులు అన్నారు. తొలి విడతలో లబ్ధిదారులందరికీ యూనిట్లు గ్రౌండింగ్‌ చేయగానే, మలి విడతలో లబ్ధిదారులను ఎంపిక చేస్తారు. జిల్లాలో గొర్రెల యూనిట్ల కొనుగోలు పథకం కింద లబ్దిదారులకు సబ్సిడీ కింద పంపిణీ చేసిన గొర్రెలు ఈనుతున్నాయని, దీంతో లబళధ్దిదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారని జేడీఏ డాక్టర్‌ ప్రభాకర్‌ తెలిపారు. సుమారు 45వేల పైచిలుకు గొర్రెలు ఈనాయని తెలిపారు. పంపిణీ చేసిన గొర్రెలు ఆరోగ్యవంతమైన గొర్రె పిల్లలను ఈనుతున్నాయని తెలిపారు. స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి ఆయాగ్రామాల్లో యూనిట్లను పరిశీలించినట్లు చెప్పారు. గొర్రె పిల్లల పెంపకంపై తగు జాగ్రత్తలు తీసుకోవాలని పెంపకందారులకు ఆయన సూచించారు. పశువైద్య సిబ్బంది ఆ దిశగా కృషిచేస్తున్నట్లు తెలిపారు. గొల్ల, కుర్మల అభ్యున్నతికి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న గొర్రెల పంపిణీ పక్రియ జిల్లాలో కొనసాగుతోంది. పశు వైద్యాధికారుల బృందాలు గొర్రెలను కొనుగోలు చేసి లబ్ధిదారులకు 75శాతం సబ్సిడీపై పంపిణీ చేస్తున్నారు. ఇటీవల గొర్రెలను కొనుగోలు కోసం మళ్లీ మూడు పశువైద్యాధికారుల బృందాలు బయలుదేరి వెళ్లాయి. చిత్తూరు, మహారాష్ట్ర లోని అకోలాలకు వెళ్లిన బృందాల వైద్యాధికారులు గొర్రెల కొనుగోలు కోసం అన్వేషిస్తున్నారు. చిత్తూరు, అనంతపూర్‌ జిల్లాలో కొన్ని నెలల క్రితం తుఫాన్‌ ప్రభావంతో వర్షాలు కురవడం మూలంగా పచ్చిగడ్డి మొలిచిన ఫలితంగా పెంపకం దారులు తమ గొర్రెలను మార్కెట్‌లో విక్రయించేందుకు ముందుకు రావడం లేదు. దీంతో గొర్రెల కొనుగోలు పక్రియ నెమ్మదిగా కొనసాగే పరిస్థితి నెలకొంది. చిత్తూరు, అకోలాలో విజ్ఞప్తి మేరకు గొర్రెల కొనుగోలు పక్రియ కొనసాగుతోంది. అయితే అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తామని అన్నారు.