గౌరీ లోకేశ్‌ హత్యపై దేశవ్యాప్త నిరసన జ్వాలలు

-హత్యపై ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటు

– కర్నాటకముఖ్యమంత్రి సిద్ధరామయ్య

బెంగళూరు,సెప్టెంబర్‌ 6(జనంసాక్షి): ప్రముఖ పాత్రికేయురాలు, రచయిత్రి, మత సామరస్య వేదిక నాయకురాలు గౌరీ లంకేశ్‌(55) దారుణహత్యపై కర్ణాటక ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నట్లు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య పేర్కొన్నారు. హత్యపై దర్యాప్తునకు ఐజీ స్థాయి అధికారితో ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. బెంగళూరు రాజరాజేశ్వర నగరలోని తన నివాసం వెలుపల మంగళవారం రాత్రి 8 గంటల సమయంలో గౌరీ లంకేశ్‌ను గుర్తుతెలియని

వ్యక్తులు సవిూపం నుంచి కాల్పులు జరిపి పరారయ్యారు. గౌరీ లంకేశ్‌ హత్యలో కుట్ర కోణం దాగి ఉందన్న విషయాన్ని ఇప్పుడే చెప్పలేమన్నారు. గౌరీ ఇటీవల తనను కలిసిందని.. అయితే ప్రాణహాని ఉందని చెప్పలేదని సిద్ధరామయ్య పేర్కొన్నారు. గౌరీ లంకేశ్‌ను విమర్శిస్తూ ఇద్దరు వ్యక్తులు ఫేస్‌బుక్‌లో పోస్టులు పెట్టారని.. వారిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు చెప్పారు. ఆమె నివాసంలో నాలుగు సీసీ కెమెరాలు ఉన్నాయని.. వాటిలో రెండింటిని పోలీసులు స్వాధీనం చేసుకుని పుటేజీని పరిశీలిస్తున్నట్లు వెల్లడించారు. ఈ అంశంపై చర్చించేందుకు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య పోలీసు ఉన్నతాధికారులతో అత్యవసర సమావేశం ఏర్పాటుచేశారు. సమావేశం అనంతరం ఈ కేసుకు సంబంధించి వివరాలను ఆయన విూడియాకు వివరించారు. పాత్రికేయురాలు గౌరీ లంకేశ్‌ను ఆమె ఇంటి వద్దే దుండగులు కాల్చి చంపిన విషయం తీవ్ర కలకలం రేపింది

ఎడిటర్స్‌ గిల్‌ ఖండన

జర్నలిస్టు గౌరి లంకేష్‌ హత్య పట్ల త్రీవ షాక్‌కు గురైనట్లు ఎడిటర్స్‌ గిల్డ్‌ పేర్కొన్నది. జర్నలిస్టు హత్యను తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఎడిటర్స్‌ గిల్డ్‌ ఓ ప్రకటనలో తెలిపింది. జర్నలిస్టును దారుణంగా హత్య చేయడమంటే, అది విూడియా స్వేచ్ఛ విూదే దాడి అని గిల్డ్‌ పేర్కొన్నది. కర్నాటక ప్రభుత్వం ఈ ఘటనను సిరీయస్‌గా తీసుకుని, వెంటనే దోషులను శిక్షించాలని, మర్డర్‌పై న్యాయ విచారణ కూడా చేపట్టాలని ఎడిటర్స్‌ గిల్డ్‌ డిమాండ్‌ చేసింది.

కీలక ఆధారాలు లభ్యం

ప్రముఖ జర్నలిస్ట్‌ గౌరీ లంకేశ్‌ హత్యకేసులో పోలీసులకు కీలక ఆధారాలు లభ్యమైనట్టు తెలుస్తోంది. ఆమె ఇంటి వద్ద ఉన్న రెండు సీసీ టీవీ కెమెరాల ఆధారంగా ఈ హత్యకు సంబంధించిన కీలక ఆధారాలను సేకరించినట్టు సమాచారం. లంకేశ్‌ నివాసం నుంచి పాస్‌వర్డ్‌ ప్రొటెక్షన్‌ కల్గిన రెండు డీవీఆర్‌లను స్వాధీనం చేసుకున్నారు. ఐటీ నిపుణుల సాయంతో వాటిని తెరచి పరిశీలిస్తున్నారు. బాధితురాలితో పాటు నిందితులు కూడా ఒకే ఫ్రేమ్‌లో ఉండే ఫొటోలు కొన్ని లభ్యమైనట్టు తెలుస్తోంది. వాటి ఆధారంగా ఆమెను దగ్గరనుంచే షూట్‌ చేసినట్టు పోలీసులు గుర్తించారు. పూర్తిస్థాయిలో నిర్థారించేందుకు ఈ ఆధారాలను ఫోరెన్సిక్‌ లేబోరేటరీకి పంపించారు. లభ్యమైన ఆధారాలను బట్టి నిందితుల్లో ఒకరు నల్లరంగు జాకెట్‌తో పూర్తిగా మాస్క్‌ ధరించి హెల్మెట్‌తో ద్విచక్రవాహనంపై వేచి వుండగా, మరో వ్యక్తి ఆమె ఇంటి ప్రాంగణంలోకి నడుచుకుంటూ వెళ్లి కాల్పులు జరిపినట్టు తెలుస్తోంది. ఈ ఘటనతో బెంగళూరులో హైఅలర్ట్‌ ప్రకటించారు. ఈ కేసు దర్యాప్తు చేసేందుకు ఇప్పటికే కొన్ని బృందాలుగా ఏర్పడిన పోలీసులు తమ విచారణను వేగవంతం చేశారు. బసవన్‌గుడి వద్ద గాంధీబజార్‌లోని గౌరీ కార్యాలయం నుంచి ఆమె ఇంటి వరకు ఉన్న సీసీ ఫుటేజీలను సేకరించిన పోలీసులు వాటిని పరిశీలిస్తున్నారు. మరోవైపు ఆమెపై కాల్పులు జరిపిన వారు ప్రొఫెషనల్‌ కిల్లర్స్‌ అయి ఉంటారని, ఆమె నివాసం వద్ద రెక్కీ నిర్వహించి ఆమె కదలికల్ని గమనించి ఈ దారుణానికి పాల్పడ్డారని పోలీసులు అంచనా వేస్తున్నారు. అనుమానితుల కదలికలను గుర్తించేందుకు వీలుగా ఆమె నివాసం వద్ద ఉన్న సీసీ టీవీలతో పాటు సవిూపంలోని జంక్షన్ల వద్ద ఉన్న ఫుటేజీలను సేకరించారు.